28-06-2025 02:10:22 PM
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చేవెళ్ల,(విజయక్రాంతి): తెలంగాణలో వచ్చే మూడేళ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు. దేశంలో 12 లక్షల ఎకరాల్లో ఈ పంట ఉంటే.. ఏపీలో 6 లక్షల ఎకరాలు, తెలంగాణలో 3 లక్షల ఎకరాల్లో సాగైందని చెప్పారు. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించి పోవాలని, ఈ మేరకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి తుమ్మల(Minister Tummala) పేర్కొన్నారు. శనివారం ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ లో భాగంగా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లిలో రైతు, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి పొలంలో మొక్కలు నాటారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆయిల్ పామ్ సాగు(Oil Palm Cultivation) కోసం 12.20 ఎకరాలకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇస్తున్నామని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఎన్ని ఎకరాలు సాగుచేసినా ఇస్తామని హామీ ఇచ్చారు. రైతుకు మొక్కల దగ్గరి నుంచి మార్కెటింగ్ దాకా ప్రభుత్వం సహకరిస్తుందని, ఈ మేరకు ప్రతి జిల్లాకు ఆయిల్ ప్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిద్దిపేటలో రిపైనరీ, ప్యాకింగ్ సహా అతి పెద్ద ప్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్యాక్టరీలన్నీ ప్రీ పొల్యూషన్ తో ఉంటాయన్నారు. పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలో కూరగయాలు ఎక్కువగా పండిస్తున్నందున, హైదరాబాద్ కు దగ్గరగా మార్కెట్ చేస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య(MLA Kale Yadaiah), రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గోనె ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.