28-06-2025 02:41:43 PM
హైదరాబాద్: మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీ.వీ.నరసింహారావు జయంతి(P. V. Narasimha Rao Jayanti) సందర్భంగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. బహుభాషాకోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ నరసింహారావు(PV Narasimha Rao) పాత్ర ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సత్తుపల్లి మట్టా రాగమయి ,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.
పీవీ మార్గం ప్రజా ప్రభుత్వానికి మార్గదర్శకం: భట్టి విక్రమార్క
మాజీ ప్రధాని, భారతరత్న, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీ.వీ. నరసింహారావు జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని ఘాట్(PV Narasimha Rao Marg) వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... పీవీ మార్గం ప్రజా ప్రభుత్వానికి మార్గదర్శకం వారి చూపిన బాటలో నడుస్తూ ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పాలన అందిస్తున్నామని తెలిపారు. పేదల భూమి హక్కులు రక్షించేందుకు భూభారతి చట్టం తీసుకువచ్చామని సూచించారు. భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ పాలనలో 24 లక్షల ఎకరాల భూముల పంపిణీ జరిగిందన్నారు. పీవీ నరసింహారావు విద్యా, ఆర్థిక, భూ సంస్కరణలు ఈ దేశానికి, రాష్ట్రానికి ఆదర్శప్రాయమైయ్యాయని భట్టి విక్రమార్క వెల్లడించారు.