6 July, 2026 | 6:40 PM

పాండ్యాపై ఒక మ్యాచ్ సస్పెన్షన్

19-05-2024 01:22 AM

ముంబై: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. ఇప్పటికే వరుస పరాజయాలతో అట్టడుగు స్థానంలో లీగ్ దశను ముగించిన ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గానూ.. ముంబై సారథి హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానాతో పాటు.. ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. తాజా సీజన్‌లో ఇది మూడో తప్పిదం కావడంతో పాండ్యాపై రూ.30 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్ పాలక మండలి.. తదుపరి మ్యాచ్‌కు అతడిని సస్పెండ్ చేసింది. ఈ సీజన్‌లో ముంబై మ్యాచ్‌లు ముగియగా.. వచ్చే ఏడాది తొలి మ్యాచ్‌కు హార్దిక్ దూరం కానున్నాడు. ‘హారిక్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించాం. మిగిలిన ఆటగాళ్లకు రూ. 12 లక్షల చొప్పన ఫైన్ వేశాం. ఈ సీజన్‌లో ముంబైకిది మూడో తప్పిదం’ అని ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటనలో పేర్కొంది.