14-06-2025 04:19:04 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనేకమంది నిరుపేదలు నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు పోరిక బలరాం నాయక్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి 1500 ఇండ్లు మంజూరు చేయాలని కోరగా 1000 ఇండ్లను మంజూరు చేస్తూ, ఉత్తర్వుల పత్రాన్ని అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే మంజూరు చేయగా, అదనంగా 1000 ఇండ్లు రావడంతో మహబూబాబాద్ నియోజకవర్గంలో 4,500 మంది పేదలకు ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లు కట్టించడానికి అవకాశం ఏర్పడిందని, ప్రభుత్వానికి, మంత్రికి, ఎంపీకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.