13-06-2025 12:53:15 AM
న్యూఢిల్లీ, జూన్ 12: అహ్మదాబాద్లోని మేఘానీనగర్ వద్ద ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ దుర్ఘటనలో ఒక్కరే ప్రాణాలతో బతికి బయటపడ్డారని, విమానం పూర్తి స్థాయిలో కాలిపోవడంతో మృతుల ఆనవాళ్లు కూడా మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం విమాన ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. అందులో 230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం లో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉంది. విమానం పేలిన వెంటనే భారీగా మంటలు వ్యాపించాయి. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఎవరినీ కాపాడే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేశ్ విశ్వాస్ను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో కలిశాను. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. విమానం పూర్తిగా కాలిపోవడంతో మృతుల ఆనవాళ్లు దొరకడం కష్టంగా మారింది. అయితే మృతదేహాల వెలికితీత పూర్తయింది. మృతుల గురించి తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్షలు చేస్తున్నాం. డీఎన్ఏ టెస్టులు చేశాకే మృతుల వివరాలు ప్రకటిస్తాం.
ఘటన జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. విమాన ప్రమాద ఘటనతో దేశం దిగ్భ్రాంతికి గురైంది. ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ప్రమాద ఘటనపై డీజీసీఏ విచారణ మొదలుపెట్టింది. బ్లాక్ బాక్స్ బయటికొస్తే ప్రమాదానికి గల కారణాలు బయటికొస్తాయి’ అని తెలిపారు. కాగా ఘటనా స్థలిని సందర్శించిన వారిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తదితరులు ఉన్నారు.