29-06-2025 03:43:40 PM
నిజామాబాద్: నిజామాబాద్ లోని వినాయక్ నగర్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ అరవింద్ కుమార్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... 40 ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని చెప్పారు.
తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, తెలంగాణ పసుపు బోర్డు కోసం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు ఇవ్వడమే కాదు... దానికి ఛైర్మన్ గా కూడా తెలంగాణ వ్యక్తినే నియమించామని అమిత్ తెలిపారు. తన చేతుల మీదుగా పసుపు బోర్డును ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పసుపు పంటకు నిజామాబాద్ రాజధాని లాంటిదని, నిజామాబాద్ పసుపు పంటకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని అమిత్ షా పేర్కొన్నారు. పసుపుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పసుపు ఒక దివ్య ఔషధమన్నారు.
యాంటి వైరల్, యాంటి బ్యాక్టీరియా, యాంటీ క్యాన్సర్ గా పసుపు పని చేస్తుందని, పసుపులోని ఔషధ గుణాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని, 2030 నాటికి ఒక బిలియన్ డాలర్ విలువైన పసుపును మనం ఎగుమతి చేయాలని సూచించారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతుపై శిక్షణ కల్పిస్తామని, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలు నాణ్యమైన పసుపు పంటకు ప్రసిద్ధి చెందాయని షా తెలిపారు. భారత్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులకు మేలు చేయాలని కృషి చేస్తున్నామని మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.