11-06-2025 10:54:07 AM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రశ్నించే కమ్యూనిస్టుల పై నరేంద్ర మోదీ, అమిత్ షా కక్ష కట్టి బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) విమర్శించారు. పాల్వంచ మండల పరిధిలోని పాండురంగాపురంలో సిపిఐ పాల్వంచ మండల 19వ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, మహాసభ ప్రారంభ సూచీగా అరుణ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు.
ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శత్రుదేశంపై విజయం సాధించిన రీతిలో స్పందించడం విచారకరమని తెలిపారు. స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిని ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేయడం సమంజసం కాదన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా చూడాలని అన్నారు. 2026 మార్చి 31 వరకు నక్సలైట్లను అంతముందిస్తామని లక్ష్యంగా పెట్టుకునిమరి ఎన్ కౌంటర్లు చేస్తుండడం, మరోపక్క తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం ద్వారా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్న విషయం స్పష్టమవుతుందన్నారు. ఇది ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగించే అంశమని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టవలసిన అవసరం ఉందని కోరారు.
పేద ప్రజలకు ఎర్ర జెండానే భరోసా అని, పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, మరో వందేళ్లైనా చెక్కు చెదరకుండా అజేయంగా నిలుస్తుందని, నిరంతరం సమరశీల పోరాటాలు సాగిస్తున్న సిపిఐ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన పార్టీ కాదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రతి పంచాయతీలో సిపిఐ ప్రాతినిధ్యం ఉండే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తనను ఎమ్మెల్యే గా గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తలిపారు. గుండాల నాగరాజు, నిమ్మల రాంబాబు, కొంగర అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, వీ పద్మజ, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.