calender_icon.png 2 December, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది జట్టులోకి పంత్

02-12-2025 01:53:22 AM

రెండో వన్డేకు ఫైనల్ 11లో మార్పులు

గత కొంతకాలంగా భారత టాపార్డర్‌లో మార్పులు కొనసాగుతూనే ఉంటున్నాయి. మ్యాచ్ మ్యాచ్‌కూ నాలుగు, ఐదు స్థానాల్లో ఆడే బ్యాటర్లు మారిపోతూ ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బలమైన కోర్ టీమ్‌ను రెడీ చేసే ఉద్దేశంతో గంభీర్ ప్రయోగాలు చేస్తున్నాడు.ఇదే క్రమంలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రుతురాజ్‌కు, వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరూ విఫలమయ్యారు. ఇప్పుడు రెండో వన్డేకు వీరిని తప్పించి పంత్, నితీశ్‌కుమార్‌లను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఆయా స్థానాలకు మ్యూజికల్ ఛైర్ కంటిన్యూ అవుతుందన్నది ఇప్పటికే తేలిపోయింది.

ప్రసిద్ధ్ కృష్ణపై వేటు... నితీశ్‌కు చోటు 

రాయ్‌పూర్, డిసెంబర్ 1 : తొలి వన్డేలో గెలిచిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై ఫోకస్ పెట్టింది. రాంఛీ వేదికగా భారీస్కోర్ చేసినప్పటకీ చివరి వరకూ సౌతాఫ్రికా పోరాడడంతో చెమటోడ్చి గెలిచింది. కోహ్లీ, రోహిత్‌ల అదిరిపోయే బ్యాటింగ్‌తోనే ఈ గెలుపు సాధ్యమైంది. అదే సమయంలో మిడిలార్డర్ వైఫల్యం ఇప్పుడు సమస్యగా మారింది. తొలి వన్డేలో అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్  నిరాశపరిచాడు.

ఒకవేళ నాలుగో స్థానంలో అతను కనీసం హాఫ్ సెంచరీ చేసినా మరొక మ్యాచ్‌లు అవకాశం దక్కి ఉండేది. అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్‌కు మరొక ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి. అలాగే స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం ఫెయిలయ్యాడు. కోచ్ గంభీర్ అతనికి ప్రమోషన్ ఇచ్చి ఐదో స్థానంలో దింపితే సక్సెస్ కాలేకపోయాడు. దీంతో గంభీర్ ప్రయోగాలపై విమర్శలు వస్తున్నాయి.

ప్రతీ జట్టుకూ ఎంతో కీలకంగా ఉండే మిడిలార్డర్‌లో స్పెషలిస్ట్ బ్యాటర్లను దింపకుండా ఎందుకు బౌలింగ్ ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ పలువురు మాజీలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో వన్డే కోసం భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేకు తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫైనల్ 11లోకి రానున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు మరొక అవకాశమిస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్ ప్లేస్‌లో పంత్‌ను తీసుకునే ఛాన్సుంది. దీంతో దాదాపు ఏడాది తర్వాత పంత్ మళ్లీ వనే ్డఆడబోతున్నాడు.పంత్ తుది జట్టులోకి వస్తే కీపింగ్ బాధ్యతలు అతనికే అప్పగిస్తామని రాహుల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ప్రసిద్ధ కృష్ణ స్థానంలో ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డి బరిలోకి దిగే ఛాన్సుంది. ఇదిలా ఉంటే రాంఛీ వన్డేలో భారత బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. ముఖ్యంగా పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిధ్దకృష్ణ భారీగా పరుగులిచ్చేశారు.

వీరిలో హర్షిత్ రాణా ఆరంభంలో వికెట్లు తీసినా పరుగులు ఎక్కువగానే ఇచ్చాడు. అందుకే ప్రధాన పేసర్లకు తోడుగా నితీశ్‌ను ఆడిస్తే బాగుంటుందన్న ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా రెండో వన్డేకు భారత తుది జట్టులో రెండు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక రాయ్‌పూర్ పిచ్ బ్యాలెన్సింగ్‌గా ఉంటుందని అంచనా. అటు పేసర్లకు, ఇటు స్పిన్నర్లతో పాటు బ్యాటర్లకు కూడా సమానంగా అనుకూలించే స్పోర్టింగ్ పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

రెండోవన్డేకు భారత 

తుది జట్టు (అంచనా) : జైస్వాల్, రోహిత్ శర్మ, కోహ్లీ, రుతురాజ్/పంత్, నితీశ్ కుమార్‌రెడ్డి, రాహుల్, జడేజా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్/ప్రసిద్ధ కృష్ణ