calender_icon.png 24 May, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిగత చర్చలు ఉండవు.. అందరూ కలిసి రావాలి

24-05-2025 05:51:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. 

గత వైసీపి ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారని, ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని పవన్ కల్యాణ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని తెలిపారు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలిసి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించినా సానుకూలంగా స్పందించలేదు.

గత ప్రభుత్వ ఛీత్కారాలు

తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాల్జేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. రూ.కోట్ల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన చిత్ర పరిశ్రమలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పినట్లు గుర్తి చేశారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేస్తూ కక్ష సాధింపులకు దిగేదన్నారు. తమకు నచ్చనివారి సినిమాల విడుదలైతే తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? అని అడిగారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదని తెలిపారు. నాగార్జున కుటుంబానికి చెందినవారి సినిమా విడుదలైనప్పుడు ఏపీ సర్కార్ తగిన విధంగా ప్రోత్సహించిందన్నారు. వ్యవస్థ బాగుండాలని, పరిశ్రమపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదనదే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తెలుగు సినిమా రంగం తమ సినిమా విడుదలకు వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ సూచించారు. దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, వై.సుప్రియ, చినబాబు, సి.అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చుని తెలిపారు. 

రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారని వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని డిప్యూటీ సీఎం ఆలోచన చేశారు. దీనిపై  ముఖ్యమంత్రితో చర్చించి కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తామని చెప్పారు.

థియేటర్ల ఆదాయంపై ఆరా

పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికి కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి. తదితర అంశాలను ఇప్పటికే చర్చించారు.