07-05-2025 08:19:06 PM
కన్వీనర్ పాస్టర్ అశోక్ పాల్..
హనుమకొండ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన శాంతి ర్యాలీ విజయవంతం అయ్యిందని ర్యాలీ కన్వీనర్ పాస్టర్ అశోక్ పాల్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజమండ్రిలో హత్యగావించబడ్డ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్, కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటక మృతుల జ్ఞాపకార్థం హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా క్రిస్టియన్ సోదరులు పాస్టర్లు, సంఘ కాపరులు, నగరవాసులు శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశం లౌకిక రాజ్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం హిందూ, ముస్లిం క్రైస్తవ మతస్తులు ఐకమత్యంతో కలిసి మెలిసి ఉండాలని మతాలు వేరు ఐన దేవుడు ఒక్కడేనని సూచించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క భారతీయుడు సైనికునిగా పని చేయాలని కోరారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏసుప్రభు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులు, పాస్టర్లు, సంఘ కాపరులు తదితరులు పాల్గొన్నారు.