19-03-2025 01:26:19 AM
పాల్వంచ, మార్చి 18 (విజయ క్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని పెద్దమ్మతల్లి గుడి ధర్మకర్తల మండలిలో కేశవాపురం, జగన్నాథపురం గ్రామస్తులకు ప్రాధాన్యత కల్పించాలని కేశవాపురం కు చెందినా గంధం నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆలయ ఈవో రజనీ కుమారికి నాయకులు కొండం వెంకన్న గౌడ్, గంధం నరసింహారావు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గంధం నరసింహారావు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గ దేవస్థానం అభివృద్ధిలో గ్రామస్థుల సేవలు కీలకమని, దాదాపు 60 ఏళ్లుగా ఆలయ నిర్మాణం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాల వరకూ గ్రామ ప్రజలు విశేషంగా సహకరిస్తున్నారని గుర్తు చేశారు. అయితే, ఇటీవల ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలిలో స్థానికులకు ప్రాధాన్యత లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తులను విస్మరిస్తూ, ఆలయ అభివృద్ధితో సంబంధం లేని వ్యక్తులను కమిటీలోకి చేర్చడాన్ని ఖండించారు. ఇరు గ్రామస్తులకు కమిటి లో 50 శాతం ప్రాధాన్యత కల్పించాలని, లేనిపక్షంలో న్యాయం కోసం భవిషత్తులో ఎలాంటి పోరాటానికైనా ముందుకెళ్తామన్నారు.ఈ కార్యక్రమంలో రవి గౌడ్, రమేష్ నాయక్, గంధం సతీష్, బానోత్ కుమార్, బ్రహ్మచారి, నాగేశ్వరరావు, లింగయ్య, ఉదయ్, సత్యనారాయణ, నవీన్, భాస్కర్, నరేష్, మహేష్, రాకేష్, రాము, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.