18-06-2025 12:54:40 AM
హైదరాబాద్, సిటీబ్యూరో జూన్ 17 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగుచూస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మావోయిస్టుల ముసుగులో దాదాపు వెయ్యి మందికి పైగా రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
గత సాధారణ ఎన్నికల సమయంలో ఒక్కరోజే దాదాపు 600మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు బాధితుల నుంచి వాంగ్మూలాన్ని రికా ర్డు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరుగా జూబ్లీహిల్స్ పీఎస్కు వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు.
సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా..
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావును నాలుగోసారి మంగళవారం సిట్ అధికారుల విచారించారు. బాధితులు చెప్పిన వివరాల మేరకు సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 2023 సాధారణ ఎన్నికల సమయంలో వాట్సాప్ గ్రూప్పై ప్రధానంగా ప్రభాకర్రావును సిట్ ప్రశ్నించింది. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి సన్నిహితులు గాలి అనిల్, వినయ్రెడ్డి ఫోన్లు ట్యాప్ చేసి స్వాధీనం చేసుకున్న డబ్బుపై కూడా సిట్ ఆరా తీసింది.
పొంగులేటి, రాజగోపాల్రెడ్డికి చెందిన కంపెనీల డబ్బును ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. 2023 ఎన్నికల సమయంలో ట్యాపింగ్ బాధితుల్లో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. పార్టీకి వ్యతి రేకంగా పనిచేస్తున్న వారి ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది.
అయితే విచారణలో సిట్ అధికారులకు సహకరించకుండా ప్రభాకర్రావు ప్రశ్నలకు దాటవేసే ధోరణి అవలంబించారని సమాచారం. ఈక్రమంలో ప్రభాకర్ రావుతో పా టు ప్రణీత్రావు, రాధాకిషన్రావు, తిరుపత న్న, భుజంగరావులతో సహా ఐదుగురు నిందితులను ఒకేసారి కలిపి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిందితులను ప్రశ్నిస్తే ఈ కేసులో కీలక పురోగతి ఉంటుందని, ప్రభాకర్రావుతో పాటు నలుగురు నిందితులను కూడా కలిపి విచారించాలని సిట్ భావిస్తోంది.
ఒక్కరోజే దాదాపు 600మంది ఫోన్ల ట్యాప్
గత సాధారణ ఎన్నికల సమయంలో, సరిగ్గా 2023 నవంబర్ 15న ఒక్కరోజే దాదాపు 600మంది ఫోన్లను ప్రభాకర్రావు బృందం ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టులు యాక్టివ్ అయ్యారని కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి, ఆ పేరుతో అధికార, ప్రతిపక్షనాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలైన రేవంత్రెడ్డి, ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్రావు వంటి వారి ఫోన్లు కూడా నిఘా బారినపడ్డాయి.
అప్పటి బీఆర్ఎస్ అధికారపక్ష నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్కు గురయ్యాయి. ప్రభాకర్రావు తమకు ప్రతిరోజు ఉదయం 2గంటల పాటు బ్రీఫింగ్ ఇచ్చేవారని ప్రణీత్రావు, రాధా కిషన్రావు, తిరుపతన్న, భుజంగరావు సిట్ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
శ్రవణ్రావు ద్వారా సమాచారాన్ని తెప్పించుకుని ప్రణీత్రావుకు ఇచ్చేవారని, ప్రణీత్రావు ఆ సమాచారాన్ని భుజంగరావుకు చేరవేసేవారని, భుజంగరావు నేరుగా బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు స్థితిగతులను వివరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతిపక్షనాయకుల వైపు ఎవరైనా వెళ్తున్నా, ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి పోలీసులతో దాడులు చేయించారు.
వ్యాపారవేత్తలపై దాడుల కోసం టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్రావును ప్రభాకర్రావు ఉపయోగించుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులు తరలిస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసి, వెంటనే పోలీసులతో పట్టుకున్నట్లు కూడా పోలీసులు తేల్చారు.
వైఎస్ షర్మిల ఫోన్లు కూడా ట్యాప్..
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. అందులో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్లు కూడా ఉన్నట్లు తేలింది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు అయ్యాయని, ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే సమాచారం ఎప్పటికప్పుడు వైఎస్ జగన్కు చేరినట్లు తెలుస్తోంది.
షర్మిల దగ్గరి మనుషులను పిలిపించి ఓ సీనియర్ పోలీస్ అధికారి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా గుర్తించారు. అప్పట్లోనే తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని షర్మిల గుర్తించారు. షర్మిలకు కూడా నోటీసులు పంపి, ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.