calender_icon.png 18 June, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్లపై ఏం చేద్దాం?

18-06-2025 12:43:41 AM

  1. నేటి సాయంత్రం 4 గం..కు సెక్రటేరియట్‌లో అఖిలపక్ష సమావేశం
  2. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ప్రత్యేక అతిథులుగా అహ్వానం 
  3. జీబీ లింక్‌పై తదుపరి కార్యాచరణపై ఎంపీలతో సమాలోచన
  4. ముఖ్యఅతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి
  5. మంత్రి ఉత్తమ్ వెల్లడి

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): గోదావరి--బనకచర్ల లింక్ ప్రాజెక్టును మరింత గట్టిగా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు బుధవారం సాయంత్రం 4 గంటలకు రాష్ర్ట సచివాలయంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ సమావేశంలో ప్రత్యేక అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

కేంద్ర మంత్రులను తాను స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి సమావేశంలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, తాను 2025 జూన్ 3న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి రాష్ర్ట ప్రభుత్వం తరపున అభ్యంతరాలను లేవనెత్తిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ అంశంపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పందిస్తూ 2025 మే 28న తన కు రాసిన లేఖలో జీబీ లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు అందలేదని చెప్పారని అయితే డీపీఆర్ అందిన తర్వాత నీటి కేటాయింపులలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు, ట్రిబ్యునల్ తీర్పులు, అంతర్ రాష్ర్ట ఒప్పందాలతో పాటు 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సమీక్షిస్తామన్నారని గుర్తు చేశారు.

ఈ నెల 13న తిరిగి తాను కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాసిన లేఖలో జీబీ లింక్ పథకంపై అభ్యంతరాలను తెలియచేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను కేంద్ర జల సంఘం ఆపేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అన్ని అంశాలను సమీక్షించిన తర్వాత జీబీ లింక్ విషయంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం సాయంత్రం సచివాలయంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.