31-10-2025 12:00:00 AM
 
							- ఎస్పీ కె. నరసింహ
సూర్యాపేట, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. వర్షాల కారణంగా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున గురువారం సూర్యాపేట రూరల్ పరిధి వెదిరెవారిగూడెం వద్ద మూసి నదిపై భీమారం లో-లెవెల్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అధిక వర్షాల వల్ల చెరువులు, నదులు, కుంటలు నిండి ప్రమాదకర రీతిలో ఉన్నాయని వాటిలోకి ఎవరు దిగవద్దన్నారు.
జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రమాదకరంగా ఉన్న స్థలాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పోలీస్ పికెట్స్ ఏర్పాటు, నీటి ప్రవాహం లోకి ఎవరు వెళ్లకుండా రోడ్లపై బారికెడ్ లు, వాహనాలు అడ్డుగా పెట్టించామన్నారు. అలాగే రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించడం, నీటి ప్రవాహంలో చిక్కుకున్న వాహనాలను తీయడం, ప్రమాదంలో ఉన్న ప్రజలను కాపాడడం జరిగిందన్నారు. అలాగే తెగిపోయిన రోడ్లను సంబం ధిత అధికారితో కలిసి మరమ్మతులు చేయించామన్నారు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, రూరల్ ఎస్ఐ బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు.