03-06-2025 08:43:18 PM
సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఆదేశం..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పట్టణ అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలతో నివేదిక రూపొందించాలని భూభారతి రెవెన్యూ సదస్సులను వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కరించుకునేలా రైతులకు తగిన ప్రోత్సాహం అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి(Former MLA Vem Narender Reddy) అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు అభివృద్ధిలో భాగస్వాములై అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన వారికి అందించేందుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు. జిల్లాలో మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కాలేజీలు, హార్టికల్చర్ కళాశాలల భవన నిర్మాణాలను పూర్తిచేసి విద్య నిర్వహణకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. వానాకాలం సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తన స్వస్థలం అయిన మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి తో పాటు నిరుద్యోగ నిర్మూలన, విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లా, పట్టణ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి పంపిస్తే అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పదో తరగతి ఫలితాల్లో మానుకోట రాష్ట్రంలో అగ్రస్థానం నిలవడం పట్ల వేం నరేందర్ రెడ్డి విద్యాశాఖ పనితీరును అభినందించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ విశాల్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కే.వీర బ్రహ్మచారి, జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.