21-06-2025 11:19:03 PM
పోడు ఉపాధి నుంచి ఆదివాసీలను దూరం చేయొద్దు..
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అడవులనే నమ్ముకొని పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వలస ఆదివాసీల భూములను లాక్కొని వారికి ఉపాధి లేకుండా చేయొద్దని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary S.K. Sabir Pasha) ప్రభుత్వాన్ని, అటవీశాఖ అధికారులను కోరారు. చుంచుపల్లి మండలం, పెనగడప పంచాయతి అటవీ ప్రాంతంలోని జగ్గారం, పాలవాగు, గడ్డిగుట్ట, జగ్గారం, మర్రిగూడెం ఆదివాసీ గూడేలను శనివారం అయన సందర్శించిన అనంతరం జగ్గారం గ్రామంలో అటవీశాఖ, ఆదివాసీ కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా సాబీర్ మాట్లాడుతూ... దశాబ్దాల క్రితం బ్రతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఆదివాసీ కుటుంబాలు పెనగడప శివారులో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకొని పోడు వ్యవసాయంపై జీవిస్తున్నారని, వీరికి అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములపై హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, జిల్లా అధికార యంత్రంగంపై ఉందన్నారు.
చట్టం ప్రకారం ఒక్కో కుటుంబం తొమ్మిది ఎకరాలలోపే పోడు సాగుచేసుకొని జీవిస్తున్నారని, అటవీ శాఖా అధికారులు వీరిని పోడు నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గతంలో వీరు సాగుచేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడంతో మిగిలిని భూమిని నాలుగు గ్రామాలకు చెందిన 200 ఆదివాసీ కుటుంబాలు సాగుచేసుకొని జీవిస్తున్నారని, ఈ భూమిని సైతం లాక్కునే ప్రయత్నాలు చేయడం సరైంది కాదన్నారు. భూములు లాక్కునే ప్రయత్నాలు మానుకొని స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే వెసులుబాటు కల్పించాలని, పోడు పట్టాలు మంజూరు చేయాలనీ కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు నీడలా సుధాకర్, మన్నెం వెంకన్న, కట్టా ఉదయ్, తాజుద్దీన్, కుంచం శ్రీనివాసరావు, మూతి శ్రీనివాస్, దస్తగిరి, ఖాసీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.