13 July, 2026 | 11:38 AM

దొరకని ఆచూకీ..! ముమ్మర గాలింపు.. నరహంతకుడు ఎక్కడ..?

13-07-2026 10:47 AM

ఆరు హత్యల కేసు నిందితుడి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు

షాబాద్: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District) షాబాద్ మండలం దైవాలగూడలో ఆరు హత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్(Rajkumar) ఆచూకీ కోసం ముమ్మర గాలింపుచర్యలు చేపట్టారు. నిందితుడు రాజ్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. చేకూరు రైల్వే ట్రాక్(Chekur railway track)పై రాజ్ కుమార్ ఆత్మహత్యకు ప్రయత్నించి, వెనక్కి తగ్గాడు. రైల్వే ట్రాక్ వద్ద రాజ్ కుమార్ కదలికలపై సీసీటీవీలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. హత్యలకు ముందు రాజ్ కుమార్ వద్ద 3 ఫోన్లు, 12 సిమ్ లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

హత్యల తర్వాత నిందితుడు రాజ్ కుమార్ ఫోన్ స్విచాఫ్  చేశాడు. హైదరాబాద్-బెంగళూరు హైవేల్లోని(Hyderabad-Bengaluru Highway) హోటల్లు, లాడ్జీ లు, దాబాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లు చూస్తున్నారు. నిందితుడి కుటుంబసభ్యులు, సన్నిహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కేసు దర్యాప్తు నుంచి షాబాద్ పోలీసులను తప్పించారు. సీపీ తరుణ్ జోషి( Tarun Joshi) ఎస్వోటీ, ప్రత్యేక బృందాలతో విచారణ కొనసాగిస్తున్నారు. నరహంతకుడు రాజ్‌కుమార్ ఆచూకీ దొరకకపోవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. నిందితుడు ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తాడా? అని గ్రామస్తులు భయపడుతున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు.