12-05-2025 05:45:53 PM
ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్
హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో 3 సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశం కోసం జరిగే పాలిసెట్-2025ను మే 13వ తేదీ (మంగళవారం) రోజున ఉ. 11.00 గం. నుండి మ. 1.30 గం. వరకు నిర్వహించనున్నట్లు, ఇందు కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ పరీక్షకు వరంగల్ నగరంలోని 12 కేంద్రాలనుండి 6424 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఒక గంట ముందుగానే, ఉదయం 10.00 గంటలకే, అనుమతిస్తారు. కావున విద్యార్థులు ఉదయం 10.00 గంటలకే పరీక్ష హాలులోకి చేరుకొని ఓఎంఆర్ షీట్లోని రెండు వైపుల లోని వివరాలు పూర్తి చేసి సంతకం చేయవలసి ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట హెచ్బి, 2బి బ్లాక్ పెన్సిల్, ఎరేసర్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తప్పక తీసుకొని రావలన్నారు. పరీక్ష ప్రారంభమైన ఉ. 11.00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడరని తెలిపారు. హాల్ టికెట్ మీద ఫోటో లేకపోతే ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో, ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డు) తప్పనిసరిగా తీసుకురావాలి. పరీక్ష కేంద్రంలో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు. ఇంజనీరింగ్ డిప్లొమా చేయాలనుకునే వారు గణితం-60 మార్కులు, భౌతిక శాస్త్రం-30 మార్కులు, రసాయన శాస్త్రం-30 మార్కులు కోసం పరీక్ష రాయవలసి ఉంటుంది. వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా చేయాలనుకునే వారు అదనంగా జీవశాస్త్రం-30 మార్కులు పరీక్ష రాయవలసి ఉంటుందన్నారు.