28-06-2025 10:54:23 PM
మున్సిపాలిటీ సర్వతో ముఖాభివృద్ధికి యాక్షన్ ప్లాన్
చండూరు,(విజయక్రాంతి): జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా, అన్ని రంగాలను అభివృద్ధి దిశగా చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి అవసరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు క్యాంప్ కార్యాలయంలో చండూరు మున్సిపాలిటీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. చండూరు మాస్టర్ ప్లాన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
హైదరాబాదుకు చెందిన సీనియర్ మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ సుభాని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్ర ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, కూడళ్ళ నిర్మాణం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, నూతన మున్సిపాలిటీ పరిపాలన భవనం, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మాణాలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. చండూరు రెవిన్యూ డివిజన్ గా మారిన తర్వాత భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని వారికి సరిపడా మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు. ప్రధానంగా డ్రైనేజ్ సిస్టంపై లోతుగా అధ్యయనం చేసి దానికనుగుణంగా మాస్టర్ ప్లాన్ రెడీ చేశామన్నారు.
ఈ యాక్షన్ ప్లాన్ ను రానున్న మూడు ఆర్థిక సంవత్సరాలలో విడతల వారీగా అభివృద్ధి చేసుకోవాలని, ఈ అభివృద్ధికి సంబంధించిన నిధులను ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో హైదరాబాద్ కు చెందిన మాస్టర్ ప్లాన్ సీనియర్ కన్సల్టెంట్ సుభాని, ఉమ్మడి నల్గొండ జిల్లా పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వరరావు, డి ఈ మనోరమ, ఏఈ నాగ ప్రసాద్, విద్యుత్ ఏఈ గణేష్, ట్రస్మ జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు చండూరు కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్ దోటి వెంకటేశ్ యాదవ్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.