సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన గ్రామసభలు
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): గ్రామాల్లో ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వం గ్రామాల్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక గ్రామ సభలను నిర్వహిస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలం మధురానగర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి ఎమ్మెల్యే సత్యం ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు, ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నట్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచితంగా సన్న బియ్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం వర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు, మరో 3500 ఇండ్లు రానున్నట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వేముల భాస్కర్, ఎంపీడీవో రాము,ఉప సర్పంచ్ తూం రాజు తదితరులు పాల్గొన్నారు.




