కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు
* అర్హులకు పని దినాలు కరువు...
* అనర్హులకు వరాలు...?
మాకు న్యాయం చేయాలి అంటూ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు కూలీల నిరసన
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలుపై సోమవారం కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించిన 120 రోజుల పనిదినాల హామీ అమలు కావడం లేదని, అర్హులైన కూలీలకు తగిన పనిదినాలు కేటాయించడం లేదని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కొందరికి ఎక్కువ రోజులు, మరికొందరికి తక్కువ రోజులు మరికొందరికి పని దినాలు పెట్టటం లేదంటూ తనకు ఇష్టానుసారంగా పని పెట్టిన వారికి మళ్లీ పేర్లను నమోదు చేస్తున్నారని ఉపాధి హామీ కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద కూలీలకు న్యాయం చేసి పారదర్శకంగా పనిదినాలు కేటాయించాలని వారు కోరారు.






