calender_icon.png 24 June, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానికానికి సన్నద్ధం!

24-06-2025 01:55:45 AM

  1. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణ
  2. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలతో ధీమా

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో తన పట్టును మరింత బలంగా నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పార్టీ లోకల్ బాడీ రాష్ట్ర ఎన్నికల కన్వీనర్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లును నియమించిన అధిష్ఠానం..జిల్లా, పార్లమెంట్, అసెంబ్లీ, మండలాలవారీగా కూడా పార్టీ లోకల్‌బాడీల ఇన్‌చార్జులను నియమించేందుకు సిద్ధమైంది.

ఈనెల 20వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించి కార్యాచరణపై కీలకంగా చర్చించింది. వచ్చే నెల 2వ తేదీన మరోసారి ఇదే అంశంపైనా వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలే ప్రస్తుతం బీజేపీకి అత్యంత కీలకమైన అంశమని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఈ ఎన్నికల కోసం పార్టీ తరపున ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యింది.  

యువతకు ప్రాధాన్యం..

సాధ్యమైనంత మేరకు యువతకే ఎక్కువగా అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులోనూ జనంలో ఉండే వారికి ప్రథమ ప్రాధాన్యం బీజేపీ నినాదంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని అధిష్ఠానం పిలుపునిచ్చింది. పార్టీని బలోపేతం చేసేందుకు ఇదో చక్కని మార్గంగా పార్టీ నేతలు భావిస్తున్నారు.