రోడ్డుపైనే పార్కింగ్..
వాహనదారులు, పాదాచారుల ఇబ్బందులు
పట్టించుకోని మున్సిపల్, పోలీస్ అధికారులు
తాండూరు, మార్చి 5, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో ప్రయాణికులు, వాహనదారులు, పాదాచారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాండూర్ పట్టణంలో అసలే ఇరుకైన రోడ్లు ఆపై నడి రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో అటువైపు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా యాదిరెడ్డి చౌక్ వద్ద ఉన్న ఆదిత్య నర్సింగ్ హోమ్ ఎదురుగా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు తమ వాహనాలను రోడ్డుపైన పార్కింగ్ చేస్తున్నారు. యాదిరెడ్డి సమీపంలో పాఠశాలలు, కళాశాలలు ఉండడంతో విద్యార్థులు ఈ దారి వెంబడే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో విద్యార్థిని, విద్యార్థులు భయాందోళనలకు గురవుతుంటారు. అడ్డ దిడ్డంగా పార్కింగ్ చేస్తూ ఉండడం పట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
అంతేకాకుండా పట్టణంలో ఉన్న అంబేద్కర్ చౌక్ సమీపంలో , శివాజీ చౌక్ వెళ్లే మార్గంలో , మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదురుగా ఉన్న శ్రీ సాయి చిన్న పిల్లల ప్రైవేటు ఆసుపత్రి వచ్చే వారు కూడా రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ప్రధాన కూడళ్ళలో వాహనాలు నడి రోడ్లపైనే వాహనాలు పార్ కింగ్ చేస్తూ ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
భవనాలు, వాణిజ్య సముదాయాలు నిర్మాణాలు చేసే సమయంలో సెట్ బ్యాక్ చేసుకుని వాహనాల పార్కింగ్ ల కోసం తప్పనిసరిగా స్థలాలు కేటాయించుకోవాలని నిబంధనలు ఉన్నాయని నిర్మాణాల కోసం అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నిర్మాణాలు జరుగుతున్న సమయంలో మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వాణిజ్య సముదాయాలు , భవనాల యజమానులు నిర్మాణాలు ఇష్టారాజ్యంగా నిర్మించుకుంటున్నారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది.
ఇప్పటికైనా పాలకులు, సంబంధిత అధికారులు స్పందించి పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై డిఎస్పి నర్సింగ్ యాదయ్యను వివరణ కోరగా పట్టణంలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్న విషయం వాస్తవమేనని త్వరలో ఆయా శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.




