‘కొప్పుల’ కుటుంబంతోనే సమస్యలు
బాబాయ్, అబ్బాయ్ అవినీతితోనే..
మన్సూరాబాద్ ప్రజలకు డ్రైనేజీ కష్టాలు
కాంగ్రెస్ నాయకుడు జక్కిడి సత్యతేజ్ రెడ్డి
ఎల్బీనగర్, జూన్ 7 : మన్సూరాబాద్ డివిజన్ లో ’కొప్పుల’ కుటుంబానికి చెందిన బాబాయ్, అబ్బాయి అవినీతితోనే ప్రజల సమస్యలు తీరలేదని, కనీసం కాలనీల్లో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించలేదని కాంగ్రెస్ నాయకుడు జక్కిడి సత్యతేజ్ రెడ్డి విమర్శించారు. మన్సూరాబాద్ డివిజన్ లో కొద్ది రోజులుగా శైలజపురి కాలనీ కేబీఆర్ ఫంక్షన్ హాల్ ఎదుట డ్రైనేజీ పొంగిపొర్లుతోందని, డ్రైనేజీ లీకేజీతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
విషయం తెలుసుకొని సత్యతేజ్ రెడ్డి కాలనీ వాసులతో కలిసి ఆదివారం ఉదయం ఆయా కాలనీల్లో పర్యటించిన, సమస్య తీవ్రతను పరిశీలించారు. కాలనీ వాసులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, వీలైనంత త్వరగా డ్రైనేజీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జక్కిడి సత్యతేజరెడ్డి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 సంవత్సరాలుగా మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, కొప్పుల నర్సింహా రెడ్డి మన్సూరాబాద్ డివిజన్ అబివృద్దిని గాలికి వదిలేశారని, పదవీకాలంలో వారి కుటుంబం అభివృద్ధి చెందింది, కానీ డివిజన్ అభివృద్ధి చెందలేదని విమర్శించారు. ముందుచూపు లేక రాబోయే తరాలకు ఉపయోగపడేవిధంగా కాలనీ లో డ్రైనేజీ వ్యవస్థ నిర్మిచకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.
మాజీ కార్పొరేటర్లు ముందు చూపుతో డ్రైనేజీ నిర్మిస్తే ఇపుడు ప్రజలకు ఈ కష్టాలు వచ్చేవి కావు అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ లోని పెండింగ్ సమస్యలను కాలనీ వాసులతో కలిసి జిల్లా ఇన్ చార్జి మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు బాలరాజ్ ,సాయి విఠల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






