ఆర్ట్స్ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
హనుమకొండ,(విజయక్రాంతి): సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించేందుకు కళాశాల యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం కళాశాలలో అన్ని విభాగాల పీజీ, యూజీ విభాగాధిపతులు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సమన్వయకర్తలతో సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ... మొత్తం 94 కార్యక్రమాలు విభిన్న రంగాల్లో ప్రజా పాలనకు సంబంధించిన కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతా భావం పెంపొందించడంతో పాటు ప్రజా సమస్యలపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి విభాగం తన ప్రత్యేకతకు అనుగుణంగా వర్క్షాప్లు, విస్తరణ ఉపన్యాసాలు, పాఠ్య ప్రణాళిక రూపకల్పన, క్లాస్రూమ్ మరమ్మతులు, కార్యాలయ నిర్వహణ మెరుగుదల, గ్రంథాలయ ప్రదర్శనలు, పరిశుభ్రత కార్యక్రమాలు, చెట్ల నాటకం వంటి పలు కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమాలను అమలు చేస్తే సమాజానికి ఉపయోగకరమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమాన్ని జూన్ 12వ తేదీ వరకు నిరంతరంగా నిర్వహించేలా విభాగాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసి, క్రమబద్ధంగా అమలు చేయాలని అన్ని విభాగాల అధిపతులకు ఆమె దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, సహాయక రిజిస్ట్రార్ శ్రీలత, వివిధ విభాగాల అధిపతులు పాల్గొని కార్యక్రమ నిర్వహణపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కళాశాల స్థాయిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.




