ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పనులను వేగవంతం చేయాలి
కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
రంగారెడ్డి, మార్చి 9 (విజయక్రాంతి ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న ప్రగతి ప్రణాళిక పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.శంషాబాద్లోని మున్సిపల్ కమ్యూనిటీ హాల్ మరియు బస్తీ దవాఖానను సందర్శించారు. రిజిస్టర్ల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని సిబ్బందిని హెచ్చరించారు.
99 రోజుల కార్యాచరణ..
జూన్ 12వ తేదీ వరకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో 99 రోజుల పాటు ఈ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి కార్యాలయంలో పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడంతో పాటు, కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవసరమైన చోట మరమ్మత్తులు, పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ జోనల్ కమిషనర్ చంద్రకళ, రాజేందర్ నగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితా దేవి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.




