26-06-2025 10:19:21 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్...
హనుమకొండ (విజయక్రాంతి): మాదకద్రవ్యాల దుర్వినియోగం వలన సమాజానికి కలిగే అనర్థాలను గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(Hanumakonda District Collector Sneha Shabarish) పిలుపునిచ్చారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, పోలీస్, తదితర ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్సిసి కేడేట్లతో నక్కలగుట్ట నుండి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమా దేశ్ పాండే జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ర్యాలీ అదాలత్ సర్కిల్ మీదుగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరగా ర్యాలీని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పాఠశాలల నుండే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని, వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు చెబుతున్నాయని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకునే చర్యలతోనే మత్తు పదార్థాల నియంత్రణకు వీలుకలుగుతుందన్నారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలన్నారు. యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దన్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్ళమని, వాటికి దూరంగా ఉంటామని విద్యార్థులు, యువత చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, ఇతర శాఖల అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.