29-06-2025 01:43:29 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున విశాఖ సూపర్-ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో దోపిడీని అడ్డుకునేందుకు రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పిడుగురాళ్ల మండలం తమ్ములచెర్వు సమీపంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. భువనేశ్వర్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులోని అనేక కోచ్లను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దొంగల ముఠా దారి దోపిడికి ప్రయత్నించింది.
రైలులో ఉన్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) అప్రమత్తమై దొంగలను పట్టుకోవడానికి యత్నించడంతో దొంగలు పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులు కనీసం 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపడంతో దొంగలు రైలు నుంచి దూకి తప్పించుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్1 కోచ్లోని ఇద్దరు దొంగలు రైలును ఆపడానికి గొలుసు లాగాడం గమనించిన జీఆర్పీ సిబ్బంది వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పట్టాల దగ్గర వేచి ఉన్న ముఠాలోని ఇతర సభ్యులు రాళ్ళు రువ్వడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.
రైల్వే పోలీసులు సకాలంలో జోక్యం చేసుకోవడంతో ప్రయాణికులు ఉపశమనం వ్యక్తం చేశారు. దీనివల్ల పెద్ద దోపిడీ తప్పిందని, దాదాపు ఏడుగురు దొంగలు ప్రయాణికులను దోచుకోవడానికి ప్రయత్నించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో రైలు దోపిడీలకు పాల్పడే ముఠాలలో వీరు భాగమని భావిస్తున్నారు. బీహార్, మహారాష్ట్రకు చెందిన ముఠాలు ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వారం వ్యవధిలో ఇది మూడవ రైలు దోపిడీ అని, వరుస దొంగతనాలు ఈ ప్రాంతంలో ప్రయాణీకుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయన్నారు. రెండు రోజుల క్రితం, పిడుగురాళ్ల సమీపంలో రెండు రోజుల క్రితం విశాఖ-చర్లపల్లి స్పెషల్ రైలులోని ఎస్4 బోగీలో దొంగలు గొలుసును లాగి ప్రయాణికులను దోచుకోవడానికి ప్రయత్నించారు. రైల్వే పోలీసులు హెచ్చరిక కాల్పులు జరపడంతో దొంగలు తప్పించుకున్నారు.
జూన్ 26న సాయుధ ముఠా ఒకటి రైల్వే సిగ్నల్ వ్యవస్థను తారుమారు చేసి చామరాజ్నగర్-తిరుపతి ఎక్స్ప్రెస్ను ఆపి, రెండు బోగీలోని ప్రయాణికులను దోచుకుంది. చిత్తూరు జిల్లాలోని సిద్దంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దోపిడీ జరిగిందన్నారు. మార్గం క్లియర్ అయినప్పటికీ, సిగ్నల్ సిద్దంపల్లి స్టేషన్ నుండి 350 మీటర్ల ముందు ఆగినట్లు సూచించింది. దొంగలు వైర్లను కట్ చేసి, రెడ్ సిగ్నల్ ప్రదర్శించడానికి వ్యవస్థను తారుమారు చేశారని రైల్వే అధికారుల దర్యాప్తులో తేలింది. ఆ ముఠా ఎస్-7, ఎస్-10 స్లీపర్ కోచ్ల వద్దకు చేరుకుంది. ఆభరణాలు ధరించిన మహిళా ప్రయాణీకులను గుర్తించడానికి ఫ్లాష్ లైట్లను ఉపయోగించి, ఒకరిపై ఒకరు ఎక్కి కిటికీలకు చేరుకుని నిద్రిస్తున్న నలుగురు మహిళల నుండి బంగారు గొలుసులను లాక్కున్నారు. దొంగిలించబడిన ఆభరణాల బరువు దాదాపు 65 గ్రాములు.