calender_icon.png 29 June, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూరాబాద్ మున్సిపాలిటీలో భారీ అవినీతి ఆరోపణలు

29-06-2025 01:50:11 PM

కమిషనర్ సమ్మయ్య, ఇద్దరు ఇంజినీర్లపై సీఎం ఓ కు ఫిర్యాదు

 విచారణ చేపట్టిన అధికారులు

హుజూరాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ(Huzurabad Municipality)లో అధికారుల అవినీతిపై తీవ్ర ఆరోపణలు(Corruption Allegations) వెలువడుతున్నాయి. టెండర్లు, కమిషన్ల పేరుతో లంచాలు, టెండర్ నిబంధనల ఉల్లంఘనలు, బెదిరింపులపై ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కమిషనర్ కెంశరపు సమ్మయ్య, అసిస్టెంట్ ఇంజినీర్ సాంబరాజు, డిప్యూటీ ఈఈ రవీంద్రనాథ్‌లపై ఆరోపణలు తీవ్రతరంగా వినిపిస్తున్నాయి.

కమిషన్ లేనిదే టెండర్ కాదట...!

ఇందిరానగర్ సిక్ వార్డ్ స్కూల్ నుంచి ఎం.వి.ఆర్ కన్వెన్షన్ హాల్ వరకు స్టోర్మ్ వాటర్ డ్రెయిన్ పనికి టెండర్ ఖరారులో 10% కమిషన్ ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేశారంటూ కాంట్రాక్టర్ రొడ్డ భరద్వాజ్ ఇటీవల సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. లంచాల వ్యవహారమంతా  మున్సిపల్ కార్యాలయంలోనే చోటు చేసుకుందని, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కార్యాలయంలోనే ఉందని బాధితుడు పేర్కొన్నాడు. ఒకే దరఖాస్తుదారుని ఎంపిక చేసి, ఇతర కాంట్రాక్టర్లను పక్కన పెట్టినట్లు, క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ ఎంపికలో నిబంధనలు తుంగలో తొక్కినట్లు ఆరోపణ. అత్యవసర పనిగా చెప్పి కేవలం ఒక రోజు బిడ్డింగ్ టైం ఇచ్చి, వారం తర్వాత లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చిన దానిపై కూడా ప్రశ్నలు ఉన్నాయి.

కులాన్ని ప్రస్తావిస్తూ బెదిరింపులు..!

లంచం ఇవ్వలేదన్న కారణంతో బాధితుడిని అర్థరాత్రి మెసేజులతో బెదిరించినట్లు, అతని కులాన్ని ప్రస్తావిస్తూ కామెంట్లు చేసినట్లు, సబార్డినేట్ అధికారులు బ్లాక్‌లిస్టింగ్ చేస్తామంటూ మానసికంగా వేధించారని ఫిర్యాదులో తెలిపారు.

ఇతర చరిత్ర కూడా బయటపెట్టిన బాధితుడు

కమిషనర్ సమ్మయ్య 2023లో మంచిర్యాల కలెక్టర్ ద్వారా సస్పెండ్ కావడం, 2024లో జగిత్యాల కలెక్టర్ వద్దకు సరెండర్ చేయడం వంటి వివరాలు పేర్కొంటూ, గతంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. సాంబరాజు గారు గత 9 ఏండ్లుగా అదే మున్సిపాలిటీలో ఉండి, కొన్ని కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.

ఫిర్యాదుదారుడు సమర్పించిన సాక్ష్యాలు:

టెండర్ పార్టిసిపెంట్స్ లిస్ట్ స్క్రీన్‌షాట్, సీసీటీవీ ఫుటేజ్, కలెక్టర్ల ఉత్తర్వుల ప్రతులు. బాక్స్ టెండర్ మరియు ఎమర్జెన్సీ టెండర్ పత్రాలు

ఫిర్యాదుపై అధికారుల విచారణ

ఈ వ్యవహారంపై స్పందించిన ఉన్నతాధికారులు జడ్పీ సీఈవో తో విచారణకు ఆదేశించగా, శనివారం మున్సిపల్ కార్యాలయంలో జెడ్పి సీఈవో శ్రీనివాస్ విచారణ చేపట్టారు. అధికారుల వివరణ తీసుకున్నారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్టు విచారణ అధికారి తెలిపారు.

ప్రజాప్రతినిధుల డిమాండ్

ఈ వ్యవహారంపై నిష్పాక్షికంగా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో ఇలా విచ్చలవిడిగా వ్యవహరించడం సరికాదని, అవినీతిని సహించబోమని స్పష్టం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ అంశంపై విచారణ చేయడానికి సాక్ష్యాలతో సహా పూర్తి సమాచారం సమర్పించేందుకు ఫిర్యాదుదారుడు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.