06-12-2025 11:39:15 AM
హైదరాబాద్: ఇండిగో విమాన ప్రయాణికులకు(IndiGo Passengers) తిప్పలు తప్పడం లేదు. ఒక్కరోజే 1000 విమానాల రద్దుతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ నుంచి వరసగా నాలుగోరోజు ఇండిగో విమానాలు(Indigo flights) రద్దు అయ్యాయి. శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే 69 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. హైదరాబాద్(Hyderabad)కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు నెలకునేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశముందని అధికారులు సూచించారు. ఇండిగో విమాన సేవల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. మూడ్రోజుల్లో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఇండిగో విమానాలను భారీగా రద్దు చేయడం, ఇతర విమానయాన సంస్థల ఛార్జీలు విపరీతంగా పెరగడంతో, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో చిక్కుకున్న వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు సమీపంలోని రైల్వే స్టేషన్లకు వెళ్తున్నారు. ప్రయాణీకుల అదనపు రద్దీని, ఎయిర్ కండిషన్డ్ కోచ్లలో వసతి కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, భారతీయ రైల్వే(Indian Railways) దాని నెట్వర్క్ అంతటా రైళ్ల సామర్థ్యాన్ని పెంచాయి. 37 రైళ్లకు 116 కోచ్ లు అదనంగా జోడించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దక్షిణ రైల్వే 18 రైళ్లలో ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచింది. తూర్పు రైల్వే3 కీలక రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్లు, నార్తర్న్ రైల్వే 8 రైళ్లలో థర్డ్ ఏసీ, చైర్కార్ కోచ్లు, పశ్చిమ రైల్వే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్లను పెంచింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే సెకండ్ ఏసీ కోచ్లను అదనంగా వేసింది. 10 రూట్లలో నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రీమియం రైళ్లలో అదనపు కోచ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది.