10-08-2024 04:50:01 AM
తిరిగి రూ.70,000 దాటిన తులం ధర
హైదరాబాద్, ఆగస్టు 9: శ్రావణ మాసం రాగానే బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. గురువారం ఒక్క రోజులోనే తులం బంగారం ధర రూ.800పైగా పెరిగింది. ప్రపంచ మార్కెట్లో ఇటీవల కొద్దిరోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పుత్తడి అమెరికాలో సానుకూల జాబ్స్ డేటా వెలువడటంతో ఒక్కసారిగా పరుగులు తీసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 820 పెరిగి రూ.70,090 వద్దకు చేరింది.
బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో రూ.68,000 స్థాయికి దిగిన పుత్తడి తిరిగి పదేపదే రూ.70,000 స్థాయికి పెరిగి మళ్లీ తగ్గుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.750 మేర పెరిగి రూ.64,250వద్దకు చేరింది. వెండి కేజీ ధర సైతం రూ.1,500 పెరిగి రూ. 88,000కు చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,468 డాలర్ల రికార్డుస్థాయికి పెరిగిపోయింది. పపంచ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా స్థానికంగా వెండి, బంగారాల ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్తకులు తెలిపారు.