10-08-2024 04:51:35 AM
రిజర్వ్బ్యాంక్ తాజా ద్రవ్య విధాన ప్రకటనలో మానిటరీ పాలసీ కమిటీ ఎటువంటి ప్రధాన ఆందోళనలను వ్యక్తపర్చకపోవడం శుభ సూచకం. అయితే సరళ విధాన ఉపసంహరణపైనే ఆర్బీఐ వైఖరిని కొనసాగించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం ఆర్బీఐ లక్ష్యం. డిపాజిట్లపై వడ్డీ వ్యయాలను పరిమితం చేసుకుని, రుణాలపై వడ్డీ ఆదాయా న్ని సుస్థిర పర్చుకోవడం బ్యాంక్లకు అవసరం. వినియోగదారులకు ధరలు తగ్గాలి. వారి డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్ల లభించాలి. అందుకు భిన్నంగా వారి గృహ రుణాలు, ఇతర వ్యక్తిగత రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు కొనసాగాలి. పరిశ్రమకు వాటి రుణ అవసరాల కోసం, విస్తరణకు, ఉపాధి కల్పనకు కనిష్ఠ వడ్డీ రేట్లు కావాలి. ఈ అవసరాలన్నీ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, వృద్ధి రేట్లపై ఆధారపడి ఉంటాయి.
ద్రవ్యోల్బణం అదుపులో ఉండాల్సిందే
వాస్తవానికి వృద్ధి సాధనకు ద్రవ్యోల్బణం అదుపులో ఉండాలి. ద్రవ్యోల్బణంపైనే బ్యాంక్ రుణ వితరణ ఆధారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం కారణంగానే వడ్డీ రేట్లు పెరిగినప్పుడే పొదుపు, మూలధన కల్పన కూడా జరుగుతుంది. అయితే ద్రవ్యోల్బణం భరించలేని స్థాయికి పెరగరాదు. అది వృద్ధికి, ఉపాధి కల్పనకు, పొదుపునకు విఘాతం కల్గిస్తుంది. వస్తూత్పత్తుల కోర్ ద్రవ్యోల్బణం ప్రస్తుతం దిగివస్తున్నది. కానీ కూరగాయలు, పప్పుదినుసులు, తృణధాన్యాలు, పాలు, పండ్లు, వంటనూనెల ధరల పెరుగుదల కారణంగా ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతున్నది. కొనుగోలు శక్తితోనో, అధిక వినియోగం కారణంగానో ఆహార ద్రవ్యోల్బణం పెరగడం లేదు.
సరఫరా అడ్డంకులు, తగిన పంటలు కొరవడటం కారణం. ఈ నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సాంప్రదాయక చర్యలపైనే ఆధారపడితే సరిపోదు. ఎంపికచేసిన నియంత్రిత పర్యవేక్షణా చర్యలు అవస రం. ఉల్లి, బియ్యం, గోధుమ, చక్కెర, కొన్ని రకాల పప్పుల ఎగుమతులపై నియంత్రణలు విధించినందున, ఆహార ద్రవ్యోల్బణానికి కొంత మద్దతు లభిస్తున్నది. 100కిపైగా దేశాల నుంచి భారత్ 1,500పైగా ఆహార ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. వంటనూ నెలు, తాజా పండ్లు, జీడిపప్పు, బాదం, పప్పు దినుసులు అత్యధికంగా దిగుమతి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వయం సమద్ధి, ఆహార భద్రత కోసం ఆహారోత్పత్తుల దేశీయ దిగుబడి పెంచాల్సిన అవసరం ఉన్నది.
సానుకూలతలు.. ప్రతికూలతలు
రుతుపవనాలు క్రమేపీ విస్తరించడం, ఖరీఫ్ సాగుబడి 2.9 శాతం పెరగడం, దేశంలో తగిన ఆహారోత్పత్తుల నిల్వలు ఉండటం, అంతర్జాతీయ ఆహారోత్తుల ధరలు దిగివస్తుండటం ఊరట కల్గించే అంశాలు. కానీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ప్రపంచ కమోడిటీ ధరల్లో ఒడిదుడుకులు ఆందోళనకారకం.
కీలక విభాగాలకు సజావుగా రుణ వితరణ
అనిశ్చిత అంతర్జాతీయ పరిస్థితుల నడుమ రిస్క్లు సమతౌల్యంగా ఉన్నందున, ప్రస్తుత పాలసీ వడ్డీ రేట్లను కొనసాగించడం సహేతుకంగా కన్పిస్తున్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైన విభాగాల్లోకి సరళంగా రుణ వితరణ జరిగేలా చూడాల్సి ఉన్నది. అప్పుడే ఆహార ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టపడి, దిగివస్తుంది. వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలకు రుణ వృద్ధి 17.4 శాతం ఉన్నప్పటికీ, ఏడాదివారీగా చూస్తే 2.3 శాతం తగ్గింది.
వైఖరిని సడలించాలి
వడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయిలో కొనసాగిస్తే రూపాయి మారకపు రేటుకు మద్దతు ఇవ్వడం, విదేశీ మారక నిల్వలను గరిష్ట స్థాయిలో అట్టిపెట్టుకోవడం, స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల్ని ఆకర్షించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం సాధ్యపడుతుందన్న ఆశ ఉన్నప్పటికీ, ఈ పాలసీ చర్యలతో ఒనగూడే ఫలితాలు తక్కువగానే ఉండవచ్చు. విధాన బాట మంచిదే కానీ, వైఖరిని సరళం చేయాల్సిన అవసరం ఉన్నది.