ఫోటోలకు ఫోజులు ఇచ్చి కాలం గడిపిండ్రు
- రాజీవ్ గృహకల్పను అస్సలు పట్టించుకోలే
- అదృష్టవశాత్తు స్లాబు కూలిన ప్రమాదం జరగలే
- పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం
- డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : శాలువలు.. దండలు వేసుకొని నమస్కారాలు పెట్టించుకుని గత పాలకులు కాలం గడిపారని ప్రజలకు మంచి చేయాలని మనసు వారిలో లేదని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని డివిజన్ 11 లో రాజీవ్ గృహకల్ప భవనంలోని మూడవ ఫ్లోర్ లో బాల్కనీ ఒక్కసారిగా పడిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి ప్రతి బ్లాక్ ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందో అనేలా భవనం శిథిలావస్థకు చేరుకుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తక్కువ సమయంలోనే ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరుతుందని ఇందులో గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకుపోయి పూర్తిస్థాయిలో అందరికీ మంచి జరిగేలా ప్రభుత్వానికి నివేదిక అందజేసి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ భవనాన్ని పూర్తిగా తొలగించి నూతన భవనం నిర్మించేందుకు పూర్తిస్థాయిలో సహాయశక్తులుగా కృషి చేస్తామని ఆ నమ్మకం నాకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మి దేవి గిరి గౌడ్, ప్రభుత్వ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.






