calender_icon.png 8 June, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు ప్లాట్లు విక్రయానికి సిద్ధం

08-06-2025 12:00:00 AM

ఈనెల 20 నాటికి నోటిఫికేషన్

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల ను బహిరంగ వేలం వేయాలని హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ సంస్థలు నిర్ణయించాయి.

ఇందుకు సంబంధించి గృహ నిర్మా ణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్, హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు వనరుల సమీకరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నెల 20 వ నాటికి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన, పాక్షికంగా పూర్తి అయిన అపార్ట్ మెంట్లు-, ఫ్లాట్లతో పాటు, ఓపెన్ ప్లాట్లు, హౌసింగ్ బో ర్డు ఆధ్వర్యంలోని నాలుగు ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేని భూము లు, అందుబాటులో ఉండే ధరలతో నిర్మించిన అపార్ట్ మెంట్లు, -ఫ్లాట్లను కొనుగోలు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గృహనిర్మాణ సం స్థ కమిషనర్ వీపీ గౌతమ్ విజ్ఞప్తి చేశారు.

ఈ విక్రయాలతో వచ్చిన ఆదాయంతో, ఓఆర్‌ఆర్ పరిసరాల్లోనూ, ఇతర జిల్లాల్లోనూ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే లా హౌసింగ్ పథకాలను చేప ట్టాలని భావిస్తున్నారు. వీటిని బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్ స్వగృహకు సంబంధించినంత వరకు గాజుల రామారం, పోచారం, ఖమ్మం పోలేపల్లి ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న టవర్లలో (ఒక్కో దానిలో సుమారు 100 నుంచి 150 వరకు ఫ్లాట్లు ఉంటాయి) ఏక మొత్తంగా విక్రయించనున్నారు.

బిల్డర్లు, ఒక గ్రూప్‌గా ఏర్పడి కొనుగోలు చేయాలనుకున్న వారితో పాటు, హౌ సింగ్ కార్యక్ర మాలు నిర్వహించే సంస్థలు, బహు ళ అంతస్తుల భవనాల అవసరమున్నవారు తీసుకునేందుకు వీలు క ల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

వేలంలో వేసిది ఇక్కడే...

రాజీవ్ స్వగృహకు సంబంధించి- రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 514, కుర్మల్ గూడ లో 20, చందానగర్ లోని 3 ఓపెన్ ఫ్లాట్లు, బండ్లగూడలో 159 పూర్తయిన ఫ్లాట్లు, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలోని 5 టవర్లలోని పూర్తి కాని కట్టడాలు, పోచారంలోని పూర్తి అయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 6 టవర్లలోని వివిధ రకాల ఫ్లాట్లు, బహదూర్ పల్లిలోని 69 ఓపె న్ ప్లాట్లు ఉన్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలోని పోతులమడుగులో 111, అమిస్తాపూర్ లోని 45 ఓపెన్ ప్లాట్లను విక్రయించ డానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఖ మ్మం జిల్లాలో పోలేపల్లిలో అసంపూర్తిగా ఉ న్న 8 టవర్లతో పాటు, 3.38 ఎకరాల ఖాళీ స్థలాన్ని కూడా బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. 

హౌసింగ్ బోర్డు స్థలాలు

కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్‌బీ)- 4వ ఫేజ్ లో ఖాళీగా ఉన్న 7 ఎకరా ల 33 గుంటల విస్తీర్ణంలో ఖాళీ భూములను, అదే కాలనీలో ఉన్న రెండు ఓపెన్ ప్లాట్లును (4,598 చదరపు గజాల విస్తీర్ణం, 2,420 చదరపు గజాల విస్తీర్ణం) ఈ- ద్వారా విక్రయించనున్నారు. నాంపల్లిలోని 1,148 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఖాళీ స్థలాన్ని, సంజీవరెడ్డి నగర్‌లో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌కు చెందిన 2,605 చదరపు గజాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంజీవరెడ్డి నగర్‌లోని కమ్యూనిటీ హాల్ (సెల్లార్, స్టిల్ట్, జీ 1) 22,285 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 37,070 చదరపు అడుగుల పార్కింగ్ స్థలంతో పూర్తి అయ్యే స్థితిలో ఉన్నది. ఈ భూములను ఫంక్షన్ హాల్ నిర్వహణ కోసమే వేలం వేయనున్నారు.