22 May, 2026 | 3:22 AM

రాజోళిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

22-05-2026 01:53 AM

రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, టిప్పర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు తరలింపు 

చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు 

అలంపూర్ మే 21: గద్వాల జిల్లా రాజోళి మండల శివారులోని తుంగభద్ర నది తీర ప్రాంతాల నుంచి ఇసుకను కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతా లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక రాజకీయ నాయకుల పలుకుబడి అధికారుల అండదండలతో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా కొందరు అక్రమార్కులు ఈ ఇసుక అక్రమ రవాణాకు తెరలేపడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో నదిని చరబట్టి పొక్లెయినర్ తో ఇసుకను తవ్వి ట్రాక్టర్లలో, టిప్పర్లలో అక్రమంగా ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటున్నట్లు గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్థానిక పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఈ తతంగం నడుస్తున్న సంబంధిత రెవెన్యూ శాఖ, పోలీస్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా మైనింగ్ అధికారులు స్పందించి ఇసుక అక్రమా రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిందిగా గ్రామ ప్రజలు కోరుతున్నారు.