04-08-2024 01:00:34 AM
డెవలపర్లకు, నివాసితులకు లాభదాయకం
ప్రభుత్వానికి పెరగనున్న ఆదాయం
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 3 (విజయక్రాంతి): దేశంలో పట్టణీకరణ క్రమంగా విస్తరిస్తుంది. స్థలాలతోపాటు ఫ్లాట్ల ధరలు క్రమంగా పెరుగు తున్నాయి. కొత్త ఫ్లాట్లు కొనుగోలు చేయాలంటే కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ క్రమంలోనే మెట్రో నగరాల్లోని ప్రజలు తాము ఉంటున్న పాత అపార్ట్మెంట్లను రీ డెవలప్మెంట్కు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి పాత భవనాల్లో ఆధునిక సౌకర్యాలు ఉండవు. అలాగే నిర్మాణపరమైన సమస్యలుంటాయి.
దీంతో పాత అపార్ట్మెంట్లను రీ డెవలప్మెంట్ చేసేందుకు ప్రజలతోపాటు డెవలపర్లు ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల ప్రజలకు ఆధునిక వసతులతో కూడిన నివాసం పాత ఇంటి స్థానంలోనే సొంతం కావడంతోపాటు డెవలపర్లకు భూమిపై పెట్టుబడి పెట్టకుండానే ఆదాయం సమకూరుతుంది. అలాగే పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటికి అనుమతులు తీసుకుంటున్న నేపథ్యంలో ఇంటి నిర్మాణ అనుమతుల రూపంలో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది.
గతంలో అపార్ట్మెంట్లకు డిమాండ్ ఉండగా, ప్రస్తుతం బంగ్లాలు, విల్లాలు, రో హౌస్లు, ఆకాశహర్మ్యాలు ఇలా కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో రీ డెవలప్మెంట్ ట్రెండ్ క్రమంగా పెరుగుతోందని రియల్టర్లు పేర్కొంటున్నారు. నివాసితులతోపాటు డెవలపర్లకు కూడా ప్రయోజనకరంగా ఉండటంతో పలువురు రియల్టర్లు రీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపున్నారు.
రీ డెవలప్మెంట్లో రకాలు..
రీ డెవలప్మెంట్లో పలు రకాలున్నాయి. వీటిలో క్లస్టర్ రీ డెవలప్మెంట్ ఒకటి. ఇరుగుపొరుగున ఉన్న కొన్ని సొసైటీలను కలిపి ఓ పెద్ద ప్రాజెక్టుగా మెరుగైన మౌలిక వసతులతో రీ డెవలప్మెంట్ చేస్తారు. అలాగే ఒకే సొసైటీని కూడా మళ్లీ కొత్తగా అదనపు హంగులు, అంతస్తులతో రీ డెవలప్మెంట్ చేయడం మరో రకం. అయితే, ఇందులోనూ కొన్ని సవాళ్లున్నాయని, రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం అందులో ఉండే నివాసితులందరి ఆమోదం పొందడం కొంత క్లిష్టమైన అంశంగా మారిందని రియల్టర్లు పేర్కొంటున్నారు. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలు కూడా సవాల్గా మారాయని చెబుతున్నారు. ప్రభుత్వ సహకారం ఉంటే రీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయని రియల్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం..
రీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేపట్టే డెవలపర్లకు మహారాష్ర్ట సర్కారు కొన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. లీజు భూమిని ఫ్రీహోల్డ్ ల్యాండ్గా మార్చడానికి ఇటీవల ప్రీమియంలను 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ప్రభుత్వ యాజమాన్యం లోని లీజు భూమిపై రీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు, ప్రీమియం కేవలం 5 శాతానికి తగ్గించింది. అలాగే క్లస్టర్ రీ డెవలప్మెంట్ కోసం ప్రీమియంలో 50% రాయితీ ఇస్తోంది. ఇది రీ డెవలప్మెంట్తోపాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచగల పెద్ద-స్థాయి ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది.