calender_icon.png 8 June, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూలధన లాభాలకు పన్ను పోటు

04-08-2024 12:59:24 AM

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతోఆందోళనలో రియల్టర్లు

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 3 (విజయక్రాంతి): మూలధన లాభాలకు పన్నుపెరగనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మూలధన లాభాలపై విధించే పన్ను చెలింపుల్లో మార్పులు చేసింది. ఇండెక్సేషన్ ప్రయోజనాలను తీసివేయడం వల్ల మూలధన లాభాలపై పన్ను విధించే నిబంధనలతో రియల్టర్లు ఆయోమయంలో పడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనల ప్రకారం దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్ టీసీజీ)పై 12.5 శాతం పన్ను విధిస్తారు.

తక్కువ కాల వ్యవధి కలిగిన మూలధన లాభాలపై స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో పన్నుపై లబ్ధి చేకూర్చే ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో చాలా మంది ప్రాపర్టీ యజమానులు ఎక్కువ పన్ను చెల్లించే పరిస్థితి అనివార్యంగా మారింది. ఉదాహరణకు.. 1990 అక్టోబర్ 15న రూ.15 లక్షలు వెచ్చించి ఓ ఇల్లు కొనుగోలు చేస్తే, 2000 సంవత్సరంలో మరమ్మతుల కోసం రూ.2.5 లక్షలు వెచ్చించారు. 2010లో మరో రూ.3 లక్షలు పెట్టారు. ఆ ఇల్లు అమ్మేటప్పుడు వీటిలో ఏ ఖర్చులు ఇంటి కొనుగోలు ఖర్చులో కలపాలో అంతుచిక్కని పరిస్థితి. వాస్తవానికి స్టాంపు డ్యూటీ, ఇంటి మెరుగుదల ఖర్చు, బ్రోకరేజీ లేదా లీగల్ ఫీజులు వంటివన్నీ కలిసి కొనుగోలు ఖర్చులో (సీవోఏ)లో ఉంటాయి. అయితే గతవారం బడ్జెట్ తర్వాత స్టాంపు డ్యూటీ అనేది సీవోఏలో ఉంటుందా? లేదా? అనేదానిపై రియల్టర్లలో చర్చ మొదలైంది.

ఆదాయ పన్ను శాఖ స్పష్టత

2001 ఏప్రిల్ 1 కంటే ముందు కొనుగోలు చేసిన ప్రాపర్టీల విషయంలో స్టాంపు డ్యూటీ అనేది కొన్ని షరతులకు లోబడి సీవోఏలో ఉంటుందని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. ‘2001 ఏప్రిల్ 1 కంటే ముందు కొన్న ప్రాపర్టీల (భూమి, భవనాలు లేదా రెండూ) విషయంలో 2001 ఏప్రిల్ ఒకటో తేదీన సీవోఏ ఎంత ఉంటుందనే సమస్య తలెత్తింది. అది ఆస్తి కొనుగోలుకు మదింపుదారుకు అయిన ఖర్చు లేదా సరసమైన మార్కెట్ విలువ (స్టాంపు డ్యూటీ విలువకు మించకూడదు) ఆ ఆస్తి సీవోఏ అవుతుంది.

పన్ను చెల్లింపుదారులు ఈ రెండింట్లో దేన్నునా ఎంచుకోవచ్చు’ అని ఐటీ శాఖ పేర్కొంది. ఇక్కడ ఆ నిబంధన వర్తింపజేస్తే సీవోఏ అనేది కొనుగోలు ఖర్చు (రూ.15 లక్షలు), బ్రోకరేజ్, లీగల్ ఫీజు (రూ.15 వేలు), స్టాంపు డ్యూటీ (రూ.75 వేలు), 2010లో అయిన మెరుగుదల ఖర్చు (రూ.3 లక్షలు) ఉంటుంది. 2000 సంవత్సరంలో పెట్టిన పెట్టుబడి ఇక్కడ వర్తించదు. 2001, ఏప్రిల్ ఒకటో తేదీ కంటే ముందు మరమ్మతుల కోసం ఖర్చు చేసిన మొత్తం ఇందులోకి రాదు. అనంతరం రిజిస్టర్డ్ ప్రాపర్టీ మదింపుదారుతో సదరు ప్రాపర్టీ సరైన విలువ (ఎఫ్‌ఎంవీ) లెక్కించాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ప్రాపర్టీ ఎఫ్‌ఎంవీ రూ.22 లక్షలు అవుతుంది. అయితే, ఐటీ శాఖ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంవీ అనేది స్టాంపు డ్యూటీ విలువ కంటే మించకూడదు.

మూలధనంపై 12.5 శాతం పన్ను

ఇక్కడ స్టాంపు డ్యూటీ విలువ రూ.20 లక్షలుగా ఉంది. అందువల్ల ఇక్కడ సీవోఏ అనేది రూ.20 లక్షలు అవుతుంది. దీనికి రూ.3 లక్షల మరమ్మతుల ఖర్చు కలిసితే.. పన్ను మదింపును రూ.23 లక్షలపై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మిస్టర్ ఏ ఆ ప్రాపర్టీని 2024 జూలై 23 తర్వాత రూ.2 కోట్లకు విక్రయిస్తే.. అందులో రూ.23 లక్షలను సీవోఏ కింద తీసివేస్తారు. దీంతో నికర విక్రయ మొత్తం రూ.1.77 కోట్లు అవుతుంది. ఇందులో బ్రోకరేజ్, లీగల్ ఫీజు రూ.2 లక్షలు తీసేసి, రూ.1.75 కోట్లపై 12.5 శాతం పన్ను.. అంటే రూ.21.87 లక్షలు చెల్లించాల్సి వస్తుంది.