17 March, 2026 | 3:25 AM

షేక్ హసీనాకు రెడ్ కార్నర్ నోటీసులు!

21-04-2025 01:51 AM

ఇప్పటికే హసీనాపై 100 కేసులు

ఢాకా, ఏప్రిల్ 20: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని బంగ్లాదేశ్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. హసీనాతో పాటు మరో 11 మందికి కూడా నోటీసులు జారీ చేయాలని విన్నవించారు.

ఇటీవలే బంగ్లాదేశ్ పోలీసులు హసీనాతో సహా మరో 72 మందిపై ప్రభుత్వం పడగొట్టేందుకు, అంతర్యుద్ధం పురుడు పోసుకునేలా కుట్ర పన్నారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం హసీనాపై ఇప్పటికే 100కు పైగా కేసులను నమోదు చేసింది. అవినీతి, సామూహిక హత్య ఆరోపణలపై కూడా కేసులు నమోదయ్యాయి.

రెడ్ నోటీసు కోసం బంగ్లాదేశ్ పోలీసులు ఇంటర్‌పోల్‌కు విన్నవించుకున్నట్టు ఢాకా ట్రిబ్యూన్ కథనం తెలిపింది. బంగ్లాదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (మీడియా) ఎనాముల్ హక్ సాగర్ ఈ సమాచారం తెలిపినట్టు వెల్లడించింది. ఈ నోటీస్ జారీ అయితే హసీనాను స్వదేశానికి తీసుకురావడం సులభం అవ్వనుందని ఆయన తెలిపినట్టు పేర్కొంది.