05-06-2025 12:10:18 AM
- దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
- ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కు బిజెపి నేతల వినతి
కార్వాన్, జూన్ 4 : సర్కిల్ పరిధిలోని లంగర్ హౌస్ చెరువుతో పాటు మూసీ నదిలో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోవడంతో దోమల సమస్య పెరిగిందని బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విషయంలో సత్వరమే స్పందించి గుర్రపు డెక్కను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం బిజెపి నేతలు కార్వాన్ జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోవడంతో దోమల బెడద పెరిగిందని తెలిపారు. రాత్రి అయితే కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దోమల కారణంగా అనేకమైన వ్యాధులు, విష జ్వరాలు ప్రబలుతున్నాయన్నారు. ఈ విషయమై గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి యంత్రాల సహాయంతో గుర్రపుడెక్కను తొలగించాలని కోరారు. లంగర్ హౌస్ చెరువును స్వయంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి దత్తత తీసుకున్నారని గుర్తు చేశారు. గుర్రపు డెక్క విషయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పార్లమెంటు బిజెపి కన్వీనర్ అల్వాల ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.