24-07-2025 12:00:00 AM
చండూరు, జూలై 23 : చండూరు మున్సిపాలిటీకి స్వర్గపురి వాహనం కేటాయించాలని కోరుతూ చేనేత పరిరక్షణ సేవా సమితి (సిపిఎస్) నాయకులు బుధవారం మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ చేనేత కార్మికులకు, పేద పద్మశాలీలకు ఆర్థిక సహకారం అందిస్తూ వస్తున్నామన్నారు.
ఎవరైనా చనిపోతే సొంత ఖర్చులతో స్వర్గపురి వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందజేస్తున్నామన్నారు. పేదలకు బియ్యం, నిత్యవసరాలు పంపిణీ చేశామన్నారు. చేనేతల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వారి పక్షాన పోరాడుతున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరింతగా ముందుకు పోవడానికి అడుగులు వేస్తున్నట్టు తెలిపారు.
చండూరు మున్సిపాలిటీ ప్రజలు స్వర్గపురి వాహనం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుపగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గపురి వాహనాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత పరిరక్షణ సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.