రైతులకు న్యాయం చేయాలని సీఎంకు వినతి
రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని సీఎం హామీ
ఆమనగల్లు, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తో కలిసి సీఎం నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గం లోని పలు సమస్యల ను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
రీజినల్ రింగ్ రోడ్డు అలైట్మెంట్ మార్పులో భాగంగా భూములు కోల్పోతున్న మాడుగుల, అమనగల్, తలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఇటీవల నిర్వహిస్తున్న ఆందోళనలు నిరసన కార్యక్రమాల గురించి సీఎంకు వివరించారు. హైదరాబాద్ సమీపంలో భూములకు విలువ మార్కెట్లో బాగా పెరిగిందని భూములు కోల్పోయే రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.
దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యేకు హామీ నిచ్చారు. అనంతరం కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలను కలిపే ఆర్ అండ్ బీ రోడ్ల విస్తరణ కోసం నిధులు కేటాయించాలని సీఎంకు వినతిపత్రం అందజేశారు.




