20-06-2025 08:08:48 PM
ఢిల్లీ: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Andhra Pradesh CM Chandrababu Naidu)తో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ఎవరితోనూ వివాదాలు కోరుకోవడం లేదని, కానీ తెలంగాణ హక్కులను వదులుకునే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అనేక కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుత వివాదానికి మూల కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా తెలంగాణను సంప్రదించకుండానే కేంద్ర ప్రభుత్వానికి పీఎఫ్ఆర్(PFR)ను సమర్పించడమేనని రేవంత్ రెడ్డి అన్నారు. "పీఎఫ్ఆర్ సమర్పించే ముందు దీనిపై చర్చించి ఉంటే, ఈ వివాదం తలెత్తేది కాదు. ఏపీ తన నివేదికను కేంద్రానికి సమర్పించిన వెంటనే, కేంద్రం కూడా అన్ని రకాల చర్యలకు సిద్ధమవుతోంది" అని సీఎం రేవంత్ వివరించారు.
ఈ అంశంపై చర్చించడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై మాట్లాడుకోవాలని సూచించారు. "ఒక రోజు కాదు, అవసరమైతే నాలుగు రోజులు చర్చిద్దాం. రాష్ట్రాల మధ్య జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. చట్టపరమైన, సాంకేతిక అంశాలను పరిశీలిద్దాం" అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో బనకచర్ల అంశంపై సమగ్ర చర్చ తర్వాత ఆంధ్రప్రదేశ్ను అధికారికంగా చర్చలకు ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. "మేము ఒక అడుగు ముందుకు వేసి ఏపీని చర్చలకు ఆహ్వానిస్తాము. తెలుగు ప్రజలలో అనవసర సమస్యలు ఉండకూడదు. పైన, కింద రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదు" అని సీఎం రేవంత్ అన్నారు.
విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు, మంత్రుల స్థాయిలో ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ హక్కులను ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. "నీళ్ళు, నిధుల పేరుతో మోసపూరిత సెంటిమెంట్ను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. కేసీఆర్(KCR) రాయలసీమను రత్నాలసీమగా చేస్తానని అన్నారు. ఏపీ గోదావరి జలాలను వాడుకుంటే తప్పు అని గతంలో వ్యాఖ్యానించారు.
కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణకు హక్కులు ఏపీకి ఇచ్చింది కేసీఆర్, హరీష్ రావులే" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ అడిగినప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) తప్పు చేశారని, ఆయన వాదన సరైనది కాదని ఆయన అన్నారు. 2023లో కేంద్రానికి హరీష్ రావు రాసిన లేఖలో తెలంగాణకు 405 టీఎంసీలు మాత్రమే అడిగారని గుర్తు చేశారు. "విభజన చట్టంలో పోలవరం మాత్రమే అనుమతించబడింది. బనకచర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు. దీనిపై తెలంగాణ అభిప్రాయం తీసుకోవాలి. గోదావరిలో 968 టీఎంసీలను వాడుకునే వెసులుబాటు తెలంగాణకు ఉంది. కానీ కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం ఇవ్వకపోవడం వల్ల వివాదాలు తలెత్తుతున్నాయి" అని రేవంత్ రెడ్డి అన్నారు.
కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా దానిపై చర్చించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాద పరిష్కారానికి కాలపరిమితి లేదని సీఎం స్పష్టం చేశారు. జూలై 6, 7 తేదీల్లో తాను మళ్ళీ ఢిల్లీకి వెళ్తానని ప్రకటించారు. అధికారం కోల్పోతున్నందుకు అసహనంతోనే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని, తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్, హరీష్ రావులేనని ఆయన వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) కేటీఆర్(KTR)కు అనుసంధాన అధికారిగా పనిచేస్తున్నారని, కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ప్రధాని మోదీ, అమిత్ షా గతంలో చెప్పారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. దీనికి కిషన్ రెడ్డి స్పందించాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.