19-02-2026 02:32:15 PM
జిల్లా కలెక్టర్ కె .హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ భవనంలోని తన చాంబర్లో వేసవిలో తాగునీటి సరఫరా పై మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి మండలాలలోని మారుమూల గిరిజన గ్రామాలకు నీటి సరఫరాను సక్రమంగా అందించేందుకు పైపులైన్లు,పంప్ హౌస్ లకు మరమ్మత్తులు చేయాల్సి ఉంటే నెలలోగా పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
కెరమెరి మండలంలోని ధనురా వద్ద డబ్ల్యూపిటి పాయింట్ నిర్మాణ పనులను ఏప్రిల్ లోగా పూర్తి చేసి ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలన్నారు.గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా పైప్ లైన్,ఓవర్ హెడ్ ట్యాంకులు,చేతి పంపులు,బోరు బావులను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.సంబంధిత అధికారులు ప్రజలకు సకాలంలో తాగునీరు అందించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సమావేశంలో మిషన్ భగీరథ గ్రిడ్ ఈ ఈ రాకేష్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సిద్ధిఖ్ తదితరులు పాల్గొన్నారు.