13-01-2026 10:05:01 PM
బ్లాక్ స్పాట్స్ గుర్తించి.. నియంత్రణ చర్యల ప్రణాళిక సిద్దం చేయాలి
ప్రతి నెలలో రోడ్ సేఫ్టీ సమావేశం నిర్వహిస్తాం
నో హెల్మెట్, నో పెట్రోల్ పక్కాగా అమలు చేయాలి
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో ఐడీఓసీలో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రోడ్డు భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్, పీ ఆర్, పోలీస్, ట్రాన్స్ పోర్ట్, వైద్య, ఎక్సైజు, విద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో రోడ్డు సేఫ్టీ కమిటీ ఛైర్ పర్సన్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా గతనెలలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై సమీక్ష చేశారు. రవాణా, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవేస్, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన క్షేత్రస్థాయి పరిశీలనపై ఆరా తీశారు.
సిద్దిపేట నేషనల్ హైవే, వేములవాడ- కోరుట్ల మార్గం, కరీంనగర్- కామారెడ్డి మార్గం, సిరిసిల్ల - కరీంనగర్ మార్గంలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద రంబుల్ స్ట్రిప్స్, సోలార్ సిగ్నల్స్, సైన్ బోర్డ్స్, రోడ్ల మరమ్మతు, కనెక్టింగ్ రోడ్ల కోసం పక్కా ప్రణాళిక తయారు చేసి, వచ్చే సమావేశంలో దానికి సంబంధించిన, అభివృద్ధి పనుల వివరాలను తెలుపాలని ఆదేశించారు. అలాగే పై రహదారుల్లో స్పీడ్ గన్స్, సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ఇప్పటికే ఉన్న వాటిని మరోసారి పరిశీలించాలని సూచించారు.
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలి
జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ లలో కచ్చితంగా నో హెల్మెట్ .. నో పెట్రోల్ అమలు చేయాలని, ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రతి బంకు యజమాని సామాజిక బాధ్యతగా దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు, క్షతగాత్రులు అవుతుంది ద్విచక్ర వాహనదారులేనని స్పష్టం చేశారు.
తమ, కుటుంబ సంరక్షణ కోసం హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. పరిమితికి మించి విద్యార్థులను, ప్రయాణీకులను తరలిస్తున్న ఆటోలు, బస్సులను తనిఖీ చేయాలని, ఓవర్ లోడ్ తో వెళ్ళే సరుకు వాహనాలపై దృష్టి సారించాలని రవాణా శాఖ అధికారులను ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సదుపాయం, క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి ప్రాణాలు కాపాడే వారికి రహవీర్ అర్థిక సహాయంపై సమీక్ష చేశారు.
అరైవ్. అలైవ్ అమలు
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్.అలైవ్ జిల్లాలో పది రోజులపాటు అమలు చేస్తామని ఎస్పీ మహేష్ బీ గీతే తెలిపారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నియమాలు పై అవగాహన కల్పించేందుకు వ్యాస రచన, క్విజ్, ఇతర పోటీలు విద్యార్థులకు, యువతకు నిర్వహిస్తామని వివరించారు. సిరిసిల్ల, వేములవాడలో ప్రధాన రోడ్లపై ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. బ్లాక్ స్పాట్స్, ఇతర రద్దీ స్థలాల్లో బారికేడింగ్ చేయిస్తామని తెలిపారు.
సమావేశంలో ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, ఈఈ ఆర్ అండ్ బీ నరసింహాచారి, డీటీఓ లక్ష్మణ్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, నేషనల్ హైవే డీఈ అన్నయ్య, ఆర్ అండ్ బీ డీఈ శాంతయ్య, డీఈఓ వినోద్ కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్ర ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, సిరిసిల్ల ఆర్టీసీ డీఎం ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.