9 April, 2026 | 5:12 AM

స్టాక్ ట్రేడింగ్ పేరిట రూ.8.14 కోట్ల టోకరా

02-12-2024 01:25 AM

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1(విజయక్రాంతి): స్టాక్ ట్రేడింగ్‌లో లాభాలు వస్తాయని, ట్రేడింగ్‌కు సంబంధించిన వాట్సప్ గ్రూప్‌లో చేరాలని చెప్పి ఆపై బాధితులకు రూ.8.14 కోట్లకు టోకరా వేసిన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరిని టీజీసీఎస్‌బీ, సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

బంజారాహిల్స్‌లో నివాసముండే ఒక వ్యక్తికి సైబర్ నేరగాళ్లు అధిక లాభాలను ఆశచూపడంతో వారి మాటలు నమ్మి సన్వారియా ఫర్నిచర్స్ పేరుతో ఉన్న కరెంట్ ఖాతాకు రూ.75 లక్షలు బదిలీ చేశాడు. అనంతరం సైబర్ నేరగాళ్లు అతడి నుంచి మరిన్ని డబ్బులు డిమాండ్ చేశారు. అతడి అప్లికేషన్‌ను మార్చారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అక్టోబర్ 21న పోలీసులను ఆశ్రయించాడు.

మూడు నెలల పాటు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన రాహుల్ డాంగీ, రాహుల్ భోయ్‌లను నిందితులుగా గుర్తించి ఉదయ్‌పూర్‌లో అరెస్ట్ చేశారు. కాగా దేశంలోని వివిధ వ్యక్తుల నుంచి సన్వారియా ఫర్నిచర్ కరెంట్ అకౌంట్‌కు రూ.8.14 కోట్లు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు.