13-06-2025 01:12:15 AM
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి
* లండన్లో ఉన్న కూతురు వద్దకు వెళ్తున్న ఓ తండ్రి అనంత లోకాలకు పయనం అయ్యాడు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఓ మాజీ సీఎం కన్నుమూశారు. భారత్లో పుట్టకపోయినా కానీ ఈ గడ్డ మీద సత్తా చాటి గుజరాత్కు 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయనే విజయ్ రూపానీ.. గురువారం జరిగిన ఘోర విమానప్రమాదంలో రూపానీ మరణించారు.
వడోదర, జూన్ 12: విజయ్భాయ్ రామ్నిక్లాల్భాయ్ రూపానీ ఆగస్టు 2 1956లో జన్మించారు. మయన్మార్లో నివాసం ఉంటున్న మాయాబెన్, రామ్నిక్లాల్ రూపానీ దంపతులకు ఏడో సంతానంగా జన్మించాడు. వారి కుటుంబంలో రూపానీ చిన్నవాడు కావడం గమనార్హం. రూపానీ 2016-2021 వరకు గుజరాత్ రాష్ట్రానికి 16వ ముఖ్యమంత్రిగా సేవలందించారు.
విజయ్రూపానీ జన్మించిన తర్వాత, మయన్మార్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల కారణంగా 1960 ప్రాంతంలో వారి కుటుంబం మయన్మార్ నుంచి రాజ్కోట్కు మకాం మార్చింది. రూపానీ ధర్మేంద్ర కాలేజ్ నుంచి ఆర్ట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు.
విద్యార్థి నాయకుడిగా..
విజయ్ రూపానీ కాలేజీ రోజుల నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాలేజీ రోజుల్లోనే ఏబీవీపీలో చేరి రాజకీయ జీవితం ఆరంభించారు. 1971లో ఆర్ఎస్ఎస్తో పాటు జన్సంఘ్లో కూడా చేరి అక్కడా రాణించారు. బీజేపీ (1980) ఆవిర్భావం నుంచి ఆయన అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో 11 నెలల పాటు ఆయన జైలు జీవితం కూడా గడిపారు. 1978-1981 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా సేవలందించారు.
కార్పొరేటర్గా..
రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తున్న రూపానీ 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ) ఎన్నికల్లో కార్పొరేటర్గా విజయం సాధించారు. అనంతరం డ్రైనేజ్ కమిటీకి చైర్మన్గా నియమితులయ్యారు. 1988 నుంచి 1996 వరకు ఆర్ఎంసీలో స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పని చేశారు. 1995లో జరిగిన ఎన్నికల్లో మరోసారి కార్పొరేటర్గా తిరిగి ఎన్నికయ్యారు. 1996-97 మధ్య కాలంలో ఆయన రాజ్కోట్ మేయర్గా విధులు నిర్వర్తించారు.
1998లో గుజరాత్ రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. కేశుభాయ్ పటేల్ సీఎంగా ఉన్న సమయంలో 1998లో మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. 2006లో గుజరాత్ టూరిజం చైర్మన్గా పదవీబాధ్యతలు స్వీకరించారు. 2006-12 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. నరేంద్ర మోదీ సీఎంగా ఉన్న సమయంలో 2013లో గుజరాత్ మున్సిపల్ ఫైనాన్స్ బోర్డ్ చైర్మన్గా సేవలందించారు.
2014లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆయన రాజ్కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపుబావుటా ఎగరేశారు. ఆనందీబెన్ పటేల్ మంత్రివర్గంలో విజయ్ రూపానీకి చోటు దక్కింది. రవాణా, నీటి వనరులు, కార్మిక, ఉపాధి శాఖలను ఆయన నిర్వర్తించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. 2016లో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనతికాలంలోనే ఆయన గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2016 చివర్లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సారధ్యంలోనే 2017 అసెంబ్లీ ఎన్నికలకు కమలనాధులు వెళ్లారు. ఆ ఎన్నికల్లో రాజ్కోట్ పశ్చిమ నియోజకవర్గం ఆయన గెలుపొందడమే కాకుండా బీజేపీని కూడా విజయపథంలో నడిపించారు. 2017లో కూడా బీజేపీ ఎమ్మెల్యేలు విజయ్నే సీఎంగా ఎన్నుకున్నారు. 2021 వరకు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 11 సెప్టెంబర్ 2021న ఆయన సీఎం పదవికి రాజీనామా సమర్పించారు. ఆయన అనంతరం భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు.
పార్టీ నాయకురాలితోనే వివాహం
విజయ్ రూపానీ బీజేపీ మహిళా విభాగానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్నా రు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూ తురు కాగా.. వారి చిన్న కొడుకు పూజిత్ రూపానీ యాక్సిడెంట్లో మరణించాడు. అతడి పేరు మీద పూజిత్ రూపానీ మెమోరియల్ ట్రస్ట్ ఫర్ చారిటీని నెలకొల్పి పలు సేవలు అందిస్తున్నారు.