13-06-2025 01:37:11 AM
మేడే.. మేడే.. మేడే.. : పైలట్ల చివరి సందేశం
అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం
265 మంది మృతి?
సీట్ నెం: 11ఏ మృత్యుంజయుడు విశ్వాస్కుమార్ రమేశ్
* అది మాటలకందని విషాదం.. కలలో కూడా ఊహించని ఘోర దుర్ఘటన.. భారత్ను ఒక్క ఉదు టున ఉలిక్కిపడేలా చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎయిర్పోర్టుకు వచ్చినవారు తమ వాళ్లకు వీడ్కోలు పలికి ఇంటికి చేరుకోకముందే దుర్ఘటన జరగడం, తమ ఆత్మీయులు అనంతలోకాలకు చేరారన్న వార్త ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా.. 265 మంది మృతిచెందినట్లు భావిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల తర్వాతే ఎంతమంది మృతి చెందారన్న వివరాలు ప్రకటించే అవకాశముంది.
అహ్మదాబాద్, జూన్ 12: గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంత ర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా 171 విమానం 242 మందితో (230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది)తో గురువారం మధ్యాహ్నం లండన్కు బయల్దేరింది. 1.38 గంటలకు రన్వే 23 నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే సాంకేతిక సమస్య తలెత్తింది.
దీంతో ఎయిర్పోర్ట్ సమీపంలోని మేఘానీ నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఫ్లుటై రాడార్ ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా ఏటీసీతో సిగ్న ల్స్ కోల్పోయింది. ఆ తర్వాత కిందకు దూసుకొచ్చిన విమానం.. మెడికల్ కాలేజీ హాస్టల్ పరిస రాల్లోని ఒక చెట్టును ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటి పొగ అన్ని వైపులకు వ్యాపించింది. ప్రమాద సమయంలో మొత్తం 230 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో భారతీయులు 169 మంది కాగా.. బ్రిటన్కు చెందిన వారు 53 మంది, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి కూడా ఉన్నా రు. ఇక 12 మంది సిబ్బందిలో ఇద్దరు పైలెట్లు .. మరో 10మంది క్యాబిన్ క్రూలు ఉన్నారు.
సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం భారీ స్థాయిలో ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమానం కూలిన విష యం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయ త్నం చేశాయి. క్షతగాత్రులను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విమానాయాన శాఖ మంత్రి కింజా రపు రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలిని సందర్శించారు.
ఈ దుర్ఘటనలో ఒక్కరు మాత్రమే క్షేమంగా బయప డినట్టు హోంమంత్రి అమిత్ షా పేర్కొనడంతో.. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజ య్ రూపానీ సహా 241 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. వీరిలో 13 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో విమానంలోని ప్రయాణికుల ఆన వాళ్లు లేకుండా పోయాయి.
డీఎన్ఏ పరీక్షల తర్వాతే ఎంతమంది మృతి చెందారన్న వివ రాలు ప్రకటించే అవకాశముంది. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో రమేశ్ కుమార్ విశ్వాస్ అనే వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి అని అహ్మదాబాద్ కమి షనర్ జీఎస్ మాలిక్ పేర్కొన్నారు.
తొలుత ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు..
ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా 171 విమానం తొలుత ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆకాశ్ వాస్త అనే ప్రయాణికుడు ‘ఎక్స్’ వేదికగా చేసిన ట్వీట్తో ఈ విషయం బయటకు వచ్చింది. అహ్మదాబాద్ చేరుకున్న విమానం అక్కడి నుంచి లండన్కు టేకాఫ్ తీసుకునేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ప్రయాణించిన ఆకాశ్ వాస్త విమానంలో అసాధారణ సంఘటనలు గమనించినట్టు తెలిపారు. ఏసీలు పనిచేయడం లేదని, అస్తవ్యస్తంగా ఉందన్నారు. అయితే ఆయన ట్వీ ట్ చేసిన రెండు గంటల వ్యవధిలోనే ఘోర దుర్ఘటన జరగడం గమనార్హం.
విద్యార్థులు భోజనం చేస్తుండగా..
ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం జనావాసాల్లో పడడంతో మృ తుల సంఖ్య చాలా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా మేఘానీనగర్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని చీ ల్చుకుంటూ విమానం కుప్పకూలింది. వి మానంలోని ఇంజిన్ భాగం హాస్టల్ గోడను చీల్చుకొని అలాగే ఉండిపోయిన దృశ్యాలు గగుర్పొడిచేలా ఉన్నాయి. అయితే విమానం బిల్డింగ్ను బలంగా తాకిన వెంటనే పేలిపోయింది.
మధ్యాహ్నం సమయం కావడంతో విద్యార్థులంతా మెస్లో ఉన్న సమయంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్లేట్లు, ఆహారం చిందరవందరగా పడిన దృశ్యాలు కనిపించాయి. ఇప్పటివరకు విమాన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. 45 నుంచి 50 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాలకే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని పలువురిని సురక్షితంగా బయటకు తీశారు.
ఘటనా స్థలిని సందర్శించిన కేంద్ర మంత్రులు అమిత్ షా, కింజారపు
అహ్మదాబాద్ విమాన ప్రమాదం మహా విషాదమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్కు చేరుకున్న రామ్మోహన్ నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లా డుతూ.. ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి సమగ్ర దర్యాప్తు జరుగుతుందన్నారు. అన్ని కోణాల్లో లోతైన, నిష్పాక్షి కమైన దర్యాప్తు చేస్తామన్నారు. విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారని, అధికారులతో సమావేశం అనంతరం మరిన్ని వివరాలు అందిస్తామన్నారు. ప్రమాదానికి కారణమైన బాధ్యుల ను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రమాదంపై ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీసినట్టు తెలిపారు.
రూ.కోటి ఎక్స్గ్రేషియా: టాటా గ్రూప్
ఎయిరిండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందించింది. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్టు వెల్లడించింది. గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా భరిస్తామని, సంరక్షణ బాధ్యత కూడా తమదేనని ఈ మేరకు ఎయిర్ ఇండియా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విమాన ప్రమాదంతో దెబ్బతిన్న బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు.
ఏమిటీ మేడే కాల్?
మేడే కాల్ అనేది డిస్ట్రెస్ కాల్. అత్యవసర ప్రమాద పరిస్థితినిఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం దీన్ని వాడుతారు. ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం అవసరమని విజ్ఞప్తం చే యడం. ఎమర్జెన్సీ సమయాల్లో ‘మేడే’ అనే పదాన్ని పైలట్లు మూడుసార్లు చెబుతారని సమాచారం. ఇక ‘మేడే కా ల్’ అనే పదం ఫ్రెంచ్ పదమైన ‘మైడర్’ నుంచి వచ్చిందని, మైడర్ అంటే ‘సా యం చేయండి’ అని అర్థం. ముఖ్యంగా విమానాలు, నౌకల్లో మేడే కాల్ను వాడుతుంటారు.
పైలట్ నుంచి మేడే కాల్..
ప్రమాద సమయానికి కొన్ని క్షణా ల ముందే విమానంలోని పైలట్ల నుం చి ఏటీసీకి ‘మేడే కాల్’ (డిస్ట్రెస్ కాల్) వచ్చినట్టు పౌర విమానాయానశాఖ తెలిపింది. ఏటీసీ పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వారి నుంచి స్పందన కరువైంది. అనంతరం నిమిషాల వ్యవధిలోనే ఎయిర్పోర్టు సమీపంలోని విమానం కూలి దట్టమైన పొగలు అలుముకున్నాయి.
11 ఏళ్లుగా సేవలు
ప్రమాదానికి గురైన విమానం వైడ్బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవ చ్చు. ఇది 11 ఏళ్లుగా ఇండియన్ ఎయిర్లైన్స్కు సేవలందిస్తోంది. కాగా ప్ర మాద ఘటనపై డీజీసీఏ స్పందించింది. విమానానికి కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లువ్ కుండర్ వ్యవహరించినట్టు పేర్కొంది. సుమిత్కు ఎల్టీసీగా 8,200 గంటలు, కో పైలట్కు 1,100 గంటల అనుభవం ఉంది.
ఏటీసీ సమాచారం మేరకు విమానం రన్వే 23 నుంచి గాల్లోకి ఎగిరిందని, కొద్ది సేపటికే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి మేడేకాల్ రాగా.. కాసేపటికే కూలిపోయిందని తెలిపింది. ఎయిర్ ఇండియా కూడా ‘ఎక్స్’ వేదికగా ప్రమాదాన్ని ధృవీకరించింది. విమానంలో 169 మంది భారతీయు లు, 53 మంది బ్రిటన్ పౌరులు సహా ఏడుగురు పోర్చుగీసు వాసులు, మరో కెనడియన్ వాసి ఉన్నట్టు తెలిపింది. ఈ ప్రమాదంపై సమాచారం కోసం హెల్ప్లైన్ నంబర్ 1800 5691 444 ఏర్పాటు చేసినట్టు తెలిపింది. తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్లో విమాన సర్వీసుల ఆపరేషన్స్ను రద్దు చేసినట్టు తెలిపింది.
నేతల దిగ్భ్రాంతి
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి తీవ్రంగా కలత చెందాను. ఇది హృదయ విదారకర ఘటన. మాటలు రావట్లేదు. ఈ క్లిష్ట సమయంలో దేశం బాధితులకు తోడుగా నిలుస్తుంది.
ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
* విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదం. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా.
ప్రధాని నరేంద్ర మోదీ
విమాన ప్రమాదం వార్త వినగానే హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం. ఈ క్లిష్ట సమయంలో ప్రతి క్షణం విలువైనదే. సహాయక చర్యలు వేగంగా జరగాలి. క్షేత్రస్థాయిలో ఎటువంటి సాయం చేసేందుకైనా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలి.
రాహుల్ గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత
* అహ్మదాబాద్ ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. క్షతగాతులను ఆ దుకునేందుకు కేం ద్రం సహాయక చర్యలు వేగవంతం చేయాలి.
రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
* అహ్మదాబాద్ విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చే సింది. ప్రయాణికు లు, సిబ్బంది, వారి కుటుంబసభ్యుల కోసం పార్థిస్తున్నా.
చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం
* అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం, అత్యంత విషాదకరం. విమానం నివాసాల మీద కూలడంతో ప్రయాణికులు, సామాన్యులు సహా వైద్య విద్యార్థులు మరణించడం బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను కోరుతున్నా. తమ ఆప్తులను కోల్పోయి, శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
కేసీఆర్, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత
భారత్లో జరిగిన విమాన ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో యూకే, కెనడా, పోర్చుగల్ ఇలా ఇతర దేశాల ప్రయాణికులు కూడా ఉన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.
జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
* ఈ విషాదసమయంలో నా సహ చరుడు ప్రధాని మోదీ, భారత ప్రజలకు అండగా నిలు స్తాం. ప్రమాదం గురించి తెలిసి బాధపడ్డా.
బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ ప్రధాని
* అహ్మదాబాద్ సమీపంలో ఎయిరిండియా విమా నానికి జరిగిన ప్ర మాదంపై విచారం వ్యక్తం చేస్తున్నాం.
మయిజ్జు, మాల్దీవులు అధ్యక్షుడు
* విమాన ప్రమా ద ఘటన హృదయవిదారకం. బాధిత కుటుంబాలు కోలుకోవాలని ఆశిస్తున్నా.
ఉర్సులా, యూరోపియన్ కమిషన్ చీఫ్
* గాట్విక్కు బయల్దేరిన విమానం ప్రమాద దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం.
కీర్ స్టార్మర్, బ్రిటన్ ప్రధాని