08-05-2025 12:00:00 AM
కొత్తగూడెం, మే 7 (విజయ క్రాంతి ): కొత్తగూడెం లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిస్కారం చేపెట్టాలనే లక్ష్యంతో,స్థానిక శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు చేసిన కృషి ఫలించింది. కూనంనేని ప్రతిపాదన మేరకు నియోజకవర్గలో నీటి సమస్య పరిస్కారంకోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఫండ్ (డిఎంఎఫ్ డీ) ద్వారా రూ.8.92 కోట్లు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తర్వలు జారీ అయ్యాయి.
ఈ నిధులతో ట్యాంకులు, పంపు హౌజులు, సంపులు, నూతన పైపు లైన్లు, పైపులైన్ల మరమ్మత్తులు, బోర్లు ఏర్పాటు చేయనున్నారు. కోయగూడెం, సోలెంగుంపు, శేషయ్య గుంపు, ఉప్పరిగూడెం, నర్సింహసాగర్, నారంగ్ తండా, నిమ్మలగూడెం, సింగభూపాలెం, పెనుబల్లి, సాటివారిగూడెం, కరిగేట్టు, సరెకల్లు గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య పరిస్కారంకోసం రూ.2.92కోట్లు, చుంచుపల్లి మండలానికి రూ.1.70కోట్లు, సుజాతనగర్ మండలానికి రూ.1.40కోట్లు, లక్ష్మీదేవిపల్లి మండలానికి రూ.1.53కోట్లు, పాల్వంచ మండలానికి రూ.1.37కోట్లు మంజూరు చేశారు.
ఈ నిధులతో 71పనులు చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిస్కారం చూపేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు, డిఎంఎఫ్టి ద్వారా మంజూరైన రూ.8.92కోట్ల విలువచేసే పనులు త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేస్తామని, ప్రజలకు నీటిని అందించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు .