calender_icon.png 23 June, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయటపడ్డ బడి దొంగలు

26-05-2025 06:21:29 PM

విధులకు డుమ్మా కొడుతున్న పంతుళ్లు..

డుమ్మా మాస్టర్ లకు అండగా డీఈవో.. 

నిరసనలకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు..

పోలేపల్లి హెడ్ మాస్టర్ సామ్యా నాయక్ సస్పెండ్..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లాలో  బడి దొంగల వ్యవహారం బయటపడింది. ఏళ్లకు ఏళ్లు విధులకు డుమ్మా కొడుతూ జిల్లా అధికారుల అండదండలతో తన వేతనాన్ని అందుకుంటుంది. ఈ డుమ్మా మాస్టర్లకు డీఈఓ అండగా ఉంటున్నాడని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆ అధికారి అండదండలతో జిల్లాలో బడిపంతులు రెచ్చిపోతున్నారు. ఈ వ్యవహారం నల్లగొండ జిల్లా(Nalgonda District) చందంపేట మండలం పోలేపల్లి పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే నల్లగొండ జిల్లాలో విద్యావ్యవస్థ బ్రష్టుపడుతోంది. ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకాకపోవడం.. సమయానికి పాఠశాలలకు చేరుకోకపోవడంతో సుమారు 30కి పైగా పాఠశాలలు ఇప్పటికే మూసివేయబడ్డాయి.

ఇదంతా ఒక ఎత్తయితే తాజాగా చందంపేట మండలంలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు గత సంవత్సరం జులై నుండి విధులకు హాజరుకాకుండా తన పలుకుబడితో నెలనెలా రూ.79 వేలకు పైగా వేతనాన్ని అందుకుంటున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందంపేట మండలం పోలేపల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కొర్రతండా పాఠశాల విద్యార్థులు లేక మూతబడింది. ఈ పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని అక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేయకుండా ఉండడంతో ఆమె విధులకు హాజరుకాకుండా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉంటోంది. ఆ మహిళా ఉపాధ్యాయురాలు చందంపేట మండలంలో ఎక్కడ విధులు నిర్వహిస్తుందో మండలంలో పనిచేసే ఏ ఉపాధ్యాయులకు తెలియకపోవడం గమనార్హం.

విధి నిర్వహణలో కనిపించని ఓ ఉపాధ్యాయురాలు ఎక్కడా పని చేయకున్నా నెలనెలా రూ. 79 వేలకు పైగా వేతనం అందుకుంటోంది. సహజంగా ఉపాధ్యాయులకు చెందిన జీతాల బిల్లును ప్రతినెల చివరివారంలో ఎస్ టి ఓ కు పంపిస్తారు. కానీ ఈ ఉపాధ్యాయురాలి వేతనాన్ని మాత్రం నెల దాటిన తర్వాత సప్లమెంటరీ బిల్లును చేసి వేతనాన్ని డ్రా చేస్తున్నారు. పలుమార్లు ఇలా డ్రా చేస్తుండడంతో అనుమానం వచ్చిన పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు సైతం ఈ విషయమై ఆరాతీయగా అసలు ఆమె మండలంలో విధులు నిర్వరించడం లేదని తెలిసి అవాక్కు అయ్యారు. అసలు విధులకు హాజరుకాని ఉపాధ్యాయురాలు తనపై అధికారులతో ఒప్పందం కుదుర్చుకొని సగం వేతనం తాను తీసుకుంటూ, మిగిలిన వేతనాన్ని పై అధికారులకు అందిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అందువల్లే ఎంఈవోపై, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పై ఇప్పటివరకు సదరు ఉపాధ్యాయురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఉపాధ్యాయురాలు సుల్తానా కు మద్దతుగా చందంపేట  ఇన్ ఛార్జ్ ఎంఈవో సామ్యా నాయక్ పూర్తి సహకారం అందిస్తున్నాడని ఎంఈఓ  వ్యవహారం పై డీఈవో బిక్షపతికి ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఆ అధికారి పిర్యాదును పట్టించుకోకుండా సామ్యా నాయక్ ను భుజాన వేసుకుని తిప్పుకుంటున్నాడని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో డీఈవో భిక్షపతి వ్యవహారంపై తాడో పేడో తేల్చుకునేందుకు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల నేతలు సిద్ధమయ్యారు. డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్లాన్ చేశారు. విషయం తెలుసుకుని ఉపాధ్యాయ సంఘ నేతలతో డిఇఓ రాజీకొచ్చి హైడ్రామాల నడుమ పోలేపల్లి హెడ్ మాస్టర్ సామ్యా నాయక్ కు ను సోమవారం సస్పెండ్ చేశారు. డీఈవో అవినీతి వ్యవహారంపై ఉన్నత అధికారులు విచారణ చేపడుతున్నారు.