26-05-2025 06:26:12 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అన్నారు. సోమవారం ఉదయాదిత్య భవన్ లో నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ల ధ్రువపత్రాల పరిశీలన, సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నెల 26 నుండి సుమారు 50 పనిదినాలు లైసెన్స్డ్ సర్వేయర్లకు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. వివిధ సందర్భాలలో నిర్వహించే సర్వే సమయంలో సర్వేయర్ల పాత్ర మరువలేనిదని అన్నారు.
భూములకు సంబంధించి సర్వేయర్లు వివిధ రకాల సర్వే నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ భూముల సర్వే, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల సందర్భంగా భూసేకరణకు సంబంధించి నిర్వహించే సర్వే, ఎఫ్ లైన్ సర్వే వంటి సర్వేల సమయంలో సర్వేయర్లు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ప్రత్యేకించి రెవెన్యూకు సంబంధించి గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో, అలాగే అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లది కీలక పాత్ర అని అన్నారు. అందువలన సర్వేయర్లు శిక్షణకు హాజరై జాగ్రత్తగా అన్ని అంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ 150 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్వే సామాగ్రిని పంపిణీ చేశారు. కాగా జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్లకై మీ-సేవ ద్వారా 819 మంది దరఖాస్తు చేసుకోగా, మొదటి విడతన సోమవారం 409 మంది ధ్రువపత్రాలు పరిశీలించడం జరిగింది. 2వ విడత ఆగస్టులో మరో 410 మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. లైసెన్స్డ్ సర్వేయర్లకు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇంచార్జ్ ఏడి సుజాత, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ రమణయ్య, సూపరింటిండెంట్ రాధాకృష్ణ, తదితరులు హాజరయ్యారు.